
సిడ్నీ: బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును భారత జట్టు డ్రా చేసుకోవడంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ, పట్టుదల, ధైర్యానికి నిదర్శనమని కొనియాడారు. ఒకవైపు ఆటగాళ్లు గాయాల బారిన పడినా, మరోవైపు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైనా ఏవీ జట్టు స్ఫూర్తిని దెబ్బతీయలేదని ట్వీట్ చేశారు.
'అద్భుతమైన టెస్ట్. భారత ఆటగాళ్ల తెగువ, పట్టుదల, ధైర్యానికి ఈ పర్ఫామెన్స్ నిదర్శనం. ఆటగాళ్లు గాయాల బారిన పడినా, జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైనా ఏవీ జట్టు స్పూర్తిని దెబ్బ తీయలేదు. హనుమ విహారీ, రవిచంద్రన్ అశ్విన్ల పోరాటం అద్భుతం. ఈ మ్యాచ్ డ్రా అయినా.. విజయం కన్నా బాగుంది.'అని ట్వీట్లో పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్పై స్పందించిన హనుమ విహారి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
సిడ్నీ టెస్ట్లో ఆస్ట్రేలియా మూడున్నర రోజులు ఆధిపత్యం చెలాయించి దాదాపు మ్యాచ్ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నంత పని చేసింది. కానీ ఆఖరి రోజు అసాధారణంగా పోరాడిన టీమిండియా మ్యాచ్ను డ్రా చేసుకుంది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 98/2తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (118 బంతుల్లో 97; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా, చతేశ్వర్ పుజారా (205 బంతుల్లో 77; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.
అనంతరం హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు)ల మారథాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్లో నిలిచి ఆరో వికెట్కు 62 పరుగులు జోడించారు. దీంతో సిరీస్ 1-1తో సమానంగా ఉంది. ఈనెల 15 నుంచి బ్రిస్బేన్లో చివరి టెస్టు జరగనుంది.