
మెల్బోర్న్: ఓపెనింగ్ సమస్య ఆస్ట్రేలియాను మరికొంత కాలం వేధించేలా ఉంది. గజ్జ గాయంతో జట్టుకు దూరమైన డేవిడ్ వార్నర్ ఇంకా కోలుకోలేదు. అతను కోలుకోవానికి ఇంకాస్త సమయం పడుతుందని ఆసీస్ టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆదివారం మీడియాకు తెలిపాడు. దాంతో జనవరి 7న భారత్తో మొదలయ్యే మూడో టెస్ట్లోనూ వార్నర్ ఆడటంపై సందేహాలు మొదలయ్యాయి. భారత్తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన వార్నర్.. చివరి వన్డేతో పాటు టీ20 సిరీస్, తొలి రెండు టెస్ట్లకు దూరమైన విషయం తెలిసిందే.
'వార్నర్ కంటే ప్రొఫెషనల్ పర్సన్ మరొకరు ఉండరు. రికవర్ అయ్యేందుకు ఏమేం చేయాల్లో అన్ని చేస్తున్నాడు. శుక్రవారం అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆదివారం కూడా ఎంసీజీలో ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్ విషయంలో వార్నర్కు ఎలాంటి సమస్యలు లేవు. కానీ గ్రోయిన్లో ఇబ్బంది ఇంకా తగ్గలేదు. వికెట్ల మధ్య రన్నింగ్, ఇతర కదలికల్లో రోజు రోజుకి మెరుగుదల కనిపిస్తోంది. అతి తర్వలోనే జట్టులోకి వస్తాడని నమ్మకంగా ఉన్నాం. తర్వాతి మ్యాచ్కు ఇంకా టైముంది. కానీ ఈ లోపు ఏం జరుగుతుందో చూడాలి'అని లాంగర్ చెప్పుకొచ్చాడు.
ఇక నాలుగు టెస్ట్ల బోర్డర్-గవాస్కర్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచిన ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. అయితే బాక్సింగ్ డే టెస్ట్లో ప్రస్తుతానికి భారత్ ఆధిక్యంలో ఉంది. ఆసీస్ను 195 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా.. తాత్కలిక సారథి రహానే సెంచరీతో ఫస్ట్ ఇన్నింగ్స్లో 326 రన్స్ చేసి 131 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ జోబర్న్స్(4), ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్ మార్నస్ (28) వికెట్లను కోల్పోయింది. క్రీజులో స్మిత్(1), మాధ్యూ వేడ్(17) ఉన్నారు.