
సిడ్నీ: కరోనా బ్రేక్ అనంతరం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ వన్డేలో బౌలింగ్లో దారుణంగా విఫలమైన భారత జట్టు.. బ్యాటింగ్లోనూ అదే తడబాటును కొనసాగిస్తోంది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన..101 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(21)తో సహా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(22), శ్రేయస్ అయ్యర్(2), కేఎల్ రాహుల్(2) దారుణంగా విఫలమయ్యారు. భారీ లక్ష్యం అనే ఒత్తిడో లేక మరే కారణమో తెలియదు కానీ ఔటైన భారత ఆటగాళ్లంతా నిర్లక్ష్యపు ఆటతీరుతోనే వరుసగా వికెట్లను చేజార్చుకున్నారు.
రోహిత్ శర్మ గైర్హాజరీతో ఓపెనర్గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ బంగారం లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. హజల్వుడ్ బౌలింగ్ మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రెక్లెస్ షాట్తో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 1 పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్ను ఆడమ్ జంపా జారవిడిచాడు. అనంతరం బౌండరీలతో చెలరేగిన కోహ్లీ క్రీజులో కుదురుకుంటున్నట్లు కనిపించాడు. కానీ హజల్వుడ్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నించి ఫించ్కు చిక్కాడు. క్రీజులోకి వచ్చిన అయ్యర్.. క్విక్ డబుల్ తీసాడు. కానీ ఆ మరుసటి బంతికే కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి కేఎల్ రాహుల్ రాగా.. అతని ఆట కూడా ఎంతోసేపు కొనసాగలేదు. జంపా వేసిన తెలివైన ఫుల్ షాట్ను కవర్స్ మీదుగా ఆడే ప్రయత్నం చేసిన రాహుల్.. ఫార్వార్డ్లో స్మిత్కు చిక్కాడు. దాంతో భారత్ 101 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.
దుబాయ్ వేదికగా ఇటీవల ముగిసిన ఐపీఎల్లో దారుణంగా విఫలమైన ఫించ్, స్మిత్, మ్యాక్స్వెల్ తాజా మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిస్తే.. సూపర్ ఫామ్లో ఉన్న మయాంక్, రాహుల్, అయ్యర్ దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఆరోన్ ఫించ్ ( 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్లతో 114), స్టీవ్ స్మిత్ (66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ ఇద్దరికి అండగా డేవిడ్ వార్నర్ (76 బంతుల్లో 6ఫోర్లతో 69) హాఫ్ సెంచరీతో రాణించగా... గ్లెన్ మాక్స్వెల్ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 45) వీర విహారం చేశాడు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ (3/59) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు. కానీ పరుగులను నియంత్రించడంలో దారుణంగా విఫలమయ్యారు. చాహల్ 89 పరుగులివ్వగా.. సైనీ 83 రన్స్ సమర్పించుకున్నాడు. బుమ్రా కూడా 73 పరుగులిచ్చాడు.