టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బుమ్రాను వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. మరో వికెట్ తీస్తే ఈ ఏడాది టెస్ట్ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకోనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా చరిత్రకెక్కనున్నాడు. ప్రస్తుతం బుమ్రా 49 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన బుమ్రా 3.04 ఎకానమీతో 49 వికెట్లు తీసాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన తొలి టెస్ట్లో బుమ్రా 8 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో బుమ్రానే భారత జట్టును నడిపించాడు. పిచ్ను సరిగ్గా రీడ్ చేసిన బుమ్రా.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం భారత బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో ఆసీస్ 104 పరుగులకే ఆలౌట్ చేశారు. బుమ్రా ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హర్షిత్ రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. కోహ్లీ, యశస్వి జైస్వాల్ శతకాలతో ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.
పిచ్ ఫ్లాట్గా మారడంతో భారత బ్యాటర్లు చెలరేగారు. అయితే అదే ఫ్లాట్ వికెట్పై భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 238 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టగా.. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు.
దాంతో ఆసీస్ 295 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆసీస్ గడ్డపై భారత్కు ఇదే అతిపెద్ద విజయం. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో బుమ్రా ఒక్క వికెట్ తీసినా.. ఈ ఏడాది 50 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఈ మ్యాచ్కు ముందు భారత్.. ఆసీస్ దేశవాళీ టీమ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో ప్రాక్టీ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 30న ప్రారంభం కానున్న ఈ వామప్ మ్యాచ్ రెండు రోజుల పాటు జరగనుంది.