
అడిలైడ్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి డే/నైట్ టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్నైట్ స్కోర్ 236/6 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీసేన.. స్టార్క్, కమిన్స్ ధాటికీ మరో 11 పరుగులు మాత్రమే చేసి 244 పరుగులకే కుప్పకూలింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా (9 ), అశ్విన్ (15) పరుగులేమి చేయకుండా వెనుదిరగ్గా.. టేలండర్ ఉమేశ్ యాదవ్(6), మహ్మద్ షమీ(0) కూడా ఆసీస్ బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. దాంతో భారత్ రెండో రోజు ఆట 25 బంతులకే పరిమితమైంది.
భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన అశ్విన్, సాహా తీవ్రంగా నిరాశపరిచారు. ఆట మొదలయిన మూడో బంతికే అశ్విన్ కీపర్ క్యాచ్గా వెనుదిరగ్గా.. మిచెల్ స్టార్క్ వేసిన ఆ మరుసటి ఓవర్లో సాహా కూడా కీపర్ పైన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ బౌండరీ కొట్టి దూకుడు కనబర్చాడు. కానీ అదే జోరులో స్టార్క్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహ్మద్ షమీ కూడా క్యాచ్ ఔటవ్వడంతో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవరాల్గా ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(4/53), ప్యాట్ కమిన్స్ (3/48) భారత్ పతనాన్ని శాసించగా.. నాథన్ లియోన్, జోష్ హజెల్ వుడ్ తలో వికెట్ తీశారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ బాధ్యతాయుత బ్యాటింగ్, చతేశ్వర్ పుజారా అడ్డుగోడ, అజింక్యా రహానే నిలకడ వెరసి టీమిండియా మొదటి రోజు ఆటను మెరుగైన స్థితిలో ముగించింది. గురువారం టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లీ (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.