
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్లోని తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారని ఆ జట్టు దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ అన్నాడు. అతను ఔటయ్యేలా బిగించిన ఉచ్చు అద్భుతమని కొనియాడాడు. అయితే, స్మిత్ 20, 30 పరుగులు చేశాడంటే నిలువరించడం కష్టమన్నాడు. ఇది గ్రహించిన భారత బౌలర్లు అడిలైడ్ టెస్ట్లో స్మిత్ 1, 1* పరుగులకే పరిమితం చేయగా మెల్బోర్న్లో 0, 8 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. స్మిత్ను కట్టడి చేసే విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, ఆ విషయంలో భారత్ బౌలర్లు సక్సెస్ అయ్యారని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు.
'స్మిత్ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు. వారు రచించిన ప్రణాళిక చాలా ఆసక్తిగా ఉండడంతో పాటు ఇప్పటి వరకూ ఫలించింది. యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ కూడా ఇలాగే ప్రయత్నించి విఫలమైంది. స్మిత్ బ్యాటింగ్ చేసేటప్పుడు టీమిండియా లెగ్ గల్లీలో ఫీల్డర్ను ఉంచి ఫలితం రాబట్టింది. అయితే, అతను ఒక్కసారి కుదురుకున్నాడంటే ఆపడం చాలా కష్టం. పిచ్ను అర్థం చేసుకుంటే పెద్ద స్కోర్లు సాధిస్తాడు. ఇక ఈ సిరీస్లో అశ్విన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పలుమార్లు స్మిత్ను ఔట్ చేశాడు' అని మెక్గ్రాత్ పేర్కొన్నాడు.

ఇక తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 36 పరుగులకే ఆలౌటై.. ఘోర పరాజయం చూడడంతో సిరీస్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుందని, సిరీస్ 4-0తో క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేసినట్లు మెక్గ్రాత్ తెలిపాడు. పైగా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నీటీ లీవ్ మీద భారత్ వెళ్లడం.. మహ్మద్ షమీ గాయంతో దూరమవడంతో ఆసీస్ పని సులువైతుందని భావించానన్నాడు. కానీ టీమిండియా అద్భుతంగా పుంజుకుందని మెచ్చుకున్నాడు. తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని, అతని సారథ్యంలో భారత ఆటగాళ్లు బాగా ఆడారని కొనియాడాడు. దీంతో మెల్బోర్న్లో మ్యాచ్ గెలిచి సిరీస్లో సమానంగా నిలిచారని ప్రశంసించాడు.