
మెల్బోర్న్: టీమిండియా పేసర్, హైదరాబాద్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ అరంగేట్ర మ్యాచ్లో అదరగొట్టాడు. ఫస్ట్ సెషన్లో ఒక్క ఓవర్ కూడా వేయని ఈ హైదరాబాద్ గల్లీ బాయ్ లంచ్ నుంచి రాగానే బంతిని అందుకున్నాడు. ఆరంభంలో లయ అందుకోవడానికి కొంత సమయం తీసుకున్న సిరాజ్ తన మొదటి స్పెల్ను 6-0-24-0తో ముగించాడు. అయితే కెప్టెన్ రహానే నమ్మకాన్ని నిలబెడుతూ టీ విరామానికి ముందు మార్నస్ లబుషేన్ను, బ్రేక్ తర్వాత క్రిస్ గ్రీన్ను పెవిలియన్ చేర్చాడు. సహచర అరంగేట్ర ఆటగాడు గిల్ పట్టిన క్యాచ్తో తొలి వికెట్ దక్కగా... పదునైన ఇన్స్వింగర్కు గ్రీన్ వికెట్ల ముందు దొరికిపోయాడు.
సిరాజ్ రెండో స్పెల్ 9-4-16-2 కావడం విశేషం. అతను రెండు క్యాచ్లు కూడా అందుకున్నాడు. ఆసీస్ చివరి వికెట్ అయిన కమిన్స్ ఇచ్చిన క్యాచ్ను లాంగాన్ బౌండరీ వద్ద అందుకున్న సిరాజ్... ఇన్నింగ్స్ ముగియడంతో తన తొలి టెస్టు జ్ఞాపికగా బంతిని తన వద్ద ఉంచుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అంపైర్ ఆక్సెన్ఫోర్డ్ దీన్ని అడ్డుకొని బంతిని వెనక్కి తీసుకున్నాడు. బహుశా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇవ్వవచ్చేమో!
అరంగేట్ర మ్యాచ్లోనే రాణించిన మహ్మద్ సిరాజ్ను టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే అరుదైన గౌరవాన్ని అందించాడు. టీమిండియా డ్రెసింగ్ రూమ్కు వెళ్లే సందర్భంలో సిరాజ్ను జట్టును లీడ్ చేయమని చెప్పాడు. ఆసీస్తో మ్యాచ్ సందర్భంగా టీ విరామం సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. టీ బ్రేక్ సమయంలో భారత కెప్టెన్ రహానే.. సిరాజ్ వద్దకు వెళ్లి 'నువ్వు ముందు వెళ్లు.. నీ వెనకాల మేము వస్తాం' అని చెప్పాడు. రహానే చెప్పినట్లుగా సిరాజ్ ముందు నడవగా.. జట్టు మొత్తం అతని వెనకాల నడిచింది. టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన సిరాజ్కు తాము ఇచ్చే గౌరవం ఇదేనని రహానే చెప్పకనే చెప్పాడు. ఈ నిర్ణయం రహానే కెప్టెన్సీని తెలియజేసింది.