
సిడ్నీ: ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న మూడో టెస్ట్కు ప్రత్యేకత సంతరించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా టెస్టు మ్యాచ్కు ఒక మహిళ అంపైర్గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిర్ పొలొసక్.. సిడ్నీ వేదికగా గురువారం ప్రారంభంకానున్న మూడో టెస్ట్లో నాలుగో అంపైర్గా విధులు చేపట్టనుంది. పురుషుల వన్డే క్రికెట్లో ఆన్ఫీల్డ్ అంపైర్గా పనిచేసిన తొలి మహిళగానూ 34 ఏళ్ల పొలొసక్ ఘనత సాధించడం గమనార్హం. 2019లో నమీబియా, ఒమన్ మధ్య జరిగిన ఐసీసీ డివిజన్ 2 లీగ్ వన్డేకు ఆమె అంపైరింగ్ చేశారు.
సిడ్నీ మ్యాచ్కు పాల్ రీఫెల్, పాల్ విల్సన్ ప్రధాన అంపైర్లు కాగా.. బ్రూస్ ఆక్సెన్ఫర్డ్ టీవీ అంపైర్గా ఉంటారు. ఆస్ట్రేలియాకే చెందిన డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం నాలుగో అంపైర్ను ఇచ్చిన నామినీలను బట్టి స్థానిక క్రికెట్ బోర్డే ఎంపిక చేస్తుంది. కొత్త బంతి తీసుకురావడం, ఫీల్డ్ అంపైర్కు డ్రింక్స్ అందించడం, లైట్మీటర్లో బ్యాటరీలు తనిఖీ చేయడం, భోజన, టీ విరామాల్లో పిచ్ను పరిశీలించడం, బెయిల్స్ను సరిచూడడం నాలుగో అంపైర్ బాధ్యతలు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ గాయపడితే నాలుగో అంపైర్ మూడో అంపైర్గా బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే మూడో అంపైర్ మైదానానికి వెళ్లాల్సి ఉంటుంది.