రెండో రోజు సైతం అదే దూకుడుతో
పుజారా జోరుతో ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత్ జట్టు తిరుగులేని ఇన్నింగ్స్ ఆడింది. ఎట్టకేలకు 622/7తో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి తిరుగులేని స్థితిలో ముగించింది. ఈ క్రమంలో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో దూకుడైన ఆటతీరు కనబరిచిన పూజారా.. పంత్లు మరిన్ని రికార్డులు కొల్లగొట్టారు.
ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్ రిషబ్ పంత్(వీడియో)
అధిక బంతులు ఎదుర్కొన్న ప్లేయర్గా
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ టెస్టు సిరీస్లో ఇప్పటి వరకూ అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత క్రికెటర్గా రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దానిని శుక్రవారం కొనసాగించిన ఇన్నింగ్స్లో పూజారా బద్దలు కొట్టాడు. 2003-04లో జరిగిన ఆసీస్ పర్యటనలో రాహుల్ ద్రవిడ్ 1,203 బంతులను ఎదుర్కొని రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును పుజారా 1,258 బంతులను ఎదుర్కొని తుడిచిపెట్టేసి నెం.1 స్థానంలోకి దూసుకెళ్లాడు. ఈ జాబితాలో (1947-48) విజయ్ హజారే 1,192 బంతులతో మూడో స్థానంలో ఉండగా.. (2014-15) విరాట్ కోహ్లీ 1,093 బంతులు, (1977-78) సునీల్ గవాస్కర్ 1,032 బంతులతో టాప్-5లో నిలిచారు.
అధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్గా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్లో ఎక్కువ బంతులు ఎదుర్కొన్న భారత క్రికెటర్గానే కాకుండా.. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గానూ పుజారా కొనసాగుతున్నాడు. అడిలైడ్, మెల్బౌర్న్ టెస్టులో సెంచరీలు సాధించిన పుజారా.. సిడ్నీలో 193 పరుగులు చేయడం ద్వారా.. మొత్తం 521 పరుగులతో నిలిచాడు.