
ముచ్చటగా మూడు..
ఈ మైదానంలో మెరుపులు మెరిపించిన టీమిండియా వీరులనూ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎంసీజీలో ఇప్పటివరకు టీమిండియా 13 మ్యాచ్లు ఆడితే ముచ్చటగా మూడింటిలో గెలిచింది. ఎనిమిది మ్యాచ్ల్లో ఓడి.. మరో రెండు మ్యాచ్లను డ్రా చేసుకుంది. ఈ రికార్డును గుర్తు చేసుకుంటే ఈసారి కూడా గెలవడం కష్టమేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్లో 1-0 లీడ్తో ఉన్న ఆసీస్ కచ్చితంగా చెలరేగిపోతుంది. కంగారూలను అడ్డుకోవడానికి అవసరమైన అనుభవం ఇప్పుడున్న టీమిండియా దగ్గర ఉందని అనుకోవడం లేదు. దీనికితోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ.. టీమ్ పెర్ఫామెన్స్పై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరుపురాని అనుభవం..
ఎంసీజీలో చాలా మ్యాచ్ల్లో ఓడినా.. 2018-19 టూర్ మాత్రం టీమిండియాకు మరపురాని అనుభవాన్ని మిగిల్చింది. డిసెంబర్ 2018లో ఇక్కడ జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ 137 రన్స్ తేడాతో ఆసీస్పై గెలిచింది. దీంతో నాలుగు మ్యాచ్ల సిరీస్లో 2-1 లీడ్ను సాధించింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6/33) మ్యాజిక్ స్పెల్తో ఇండియాను గెలిపించాడు. ఆసీస్ గడ్డపై టీమిండియా బౌలర్లలో ఇదే బెస్ట్ పెర్ఫామెన్స్. నాలుగో టెస్ట్ను డ్రా చేసుకున్న కోహ్లీసేన.. గతంలో ఏ టీమ్ సాధించని సిరీస్ను ఫస్ట్ టైమ్ సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో ఇంగ్లండ్ తర్వాత ఆసీస్ను నిలువరించిన రెండో టీమ్గా భారత్కు పేరొచ్చింది.

2014లో అత్యధిక స్కోర్..
2014లో ఇక్కడే జరిగిన టెస్ట్ను టీమిండియా డ్రా చేసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆసీస్ 530 రన్స్ చేస్తే.. బదులుగా టీమిండియా 465 రన్స్ సాధించింది. ఎంసీజీలో భారత్కు ఇదే హయ్యెస్ట్ స్కోర్. 1977లో ఆసీస్ గడ్డపై భారత్కు ఫస్ట్ టెస్ట్ విక్టరీ కూడా ఇదే వేదికపై రావడం మరో విశేషం. ఆ తర్వాత 1981లో గుండప్ప విశ్వనాథ్ చలువతో మళ్లీ గెలిచింది. ఈ మూడు విజయాలు మినహా.. ఎంసీజీలో మన ఆట అంతంత మాత్రంగానే ఉంది. పాత రికార్డులను చెరిపేయాలంటే గత రెండు పర్యటనల్లో సాధించిన సక్సెస్ను ఎంసీజీలో టీమిండియా రిపీట్ చేయాలి. ఇది జరగాలంటే ఫైనల్ ఎలెవన్ కుదరాలి. ప్రస్తుతానికైతే టీమిండియా తుది కూర్పులో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే.

గాయపడిన పులిలా..
పెటర్నిటీ లీవ్లో ఉన్న విరాట్ ప్లేస్ను భర్తీ చేసే మొనగాళ్లు లేకపోయినా.. ఆ స్థాయిలో బ్యాలెన్స్ చేస్తే చాలు. మరి ఆ బ్యాట్స్మన్ ఎవరు..? రిస్ట్ ఇంజ్యురీతో టీమ్కు దూరమైన షమీని మరిపించేలా మరో యంగ్ పేసర్ బయటకు రావాలి. అతను ఎవరు..? భారీ ఓపెనింగ్ ఇచ్చే ఇద్దరు ప్లేయర్లు ఇప్పుడు భారత్కు అత్యవసరం. వాళ్లిద్దరు ఎవరు..? మిడిలార్డర్లో పుజారా, రహానెకు అండగా నిలిచే మిగతా వాళ్లు ఎవరు..? ఇవన్నీ కుదిరినా టీమ్ స్ట్రాటజీ ఏంటీ? ఐదుగురు బౌలర్లతో దిగుతారా? బ్యాటింగ్ డెప్త్ కోసం స్పిన్ ఆల్రౌండర్కు చాన్స్ ఇస్తారా? వీటన్నింటికీ సమాధానాలు వెతకాల్సిందే. నిక్కచ్చిగా చెప్పాలంటే.. ఇప్పుడు టీమిండియా గాయపడిన పులి. దాని నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉండాలే తప్ప.. గతాన్ని గుర్తు చేసేలా ఉండకూడదు.


Click it and Unblock the Notifications












