
రాజ్కోట్: ఓటమి ఎప్పుడూ స్పూర్తినివ్వాలి.. పరాజయం ఎప్పుడూ పాఠం నేర్పాలి.. రెండో వన్డేలో టీమిండియా ప్లేయర్లకు ఇది సరిగ్గా సరిపోతుంది. తొలి మ్యాచ్ ఓటమి బాధించిందో లేక ప్రతీకారం తీసుకోవాలనే కసి పెరిగిందేమో గానీ.. ధావన్ దంచికొడితే.. రాహుల్ రఫ్ఫాడించాడు.
వీరి మధ్యలో కోహ్లీ కంగారులను కంగారుపెట్టాడు. ఫలితంగా అద్భుత విజయం ఇండియాను వరించింది. దీంతో ఆస్ట్రేలియా తిక్క కుదిరింది.. భారత్ సిరీస్ లెక్క సరిచేసింది. మొత్తానికి అభిమానులకు కావాల్సిన మజా లభించింది. ఈ విజయానందాన్ని ఒక్కొకరు ఒకలా వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యాచ్ జరుగుతున్నంత సేపు బ్యాట్స్మన్ భారీషాట్లు.. బౌలర్ల బెంబెలేత్తించే బంతులు.. ఫీల్డర్స్ అద్భుత విన్యాసాలు అభిమానులను కనువిందు చేయగా.. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇంతకీ ఆ ఘటనేంటంటే.. మైదానం స్వీపర్స్ గర్బా డ్యాన్స్. అవును ఓవైపు మ్యాచ్ ముగిసి ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటుండగా.. మరోవైపు మ్యాచ్ గెలిచిన ఆనందంతో ముగ్గురు స్వీపర్లు చిందేశారు. తమ గర్బా డ్యాన్స్తో కెమెరాను ఆకర్షించారు.
ఎవరని పట్టించుకోకుండా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకేముందు దీనికి ముగ్ధుడైన ఓ నెటిజన్.. బెస్ట్ మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ అని ప్రపంచంతో పంచుకున్నాడు. 'స్క్రబ్బర్స్తో పిచ్ క్లీన్ చేస్తున్నారని ఆసీస్ మీడియా, అభిమానులు వెక్కిరించారు. కానీ వారు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. భారత్కు విజయం దక్కడంతో ఇలా సంబరాలు చేసుకుంటున్నారు.'అని క్యాప్షన్గా పేర్కొన్నాడు.
ఇక రెండో వన్డేలో భారత్ 36 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్లో శిఖర్ ధావన్(98), కోహ్లీ(78), కేఎల్ రాహుల్(80), రోహిత్ శర్మ (42) రాణించగా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో కోహ్లీ సేన సునాయస విజయాన్నందుకుంది. డిసైడర్ వన్డే బెంగళూరు వేదికగా ఆదివారం జరగనుంది.