
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు నిబంధనల ప్రకారం ఆడలేమని, క్వారంటైన్ కట్టుబాట్లను పాటించలేమని భావిస్తే ఇక్కడికి రావద్దని క్వీన్స్లాండ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాస్ బేట్స్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీగ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమె వ్యాఖ్యలు భారత జట్టు నిబంధనలను పాటించదనే తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉన్నాయని బోర్దు భావిస్తుందని సమాచారం. ఆమె వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్న బీసీసీఐ సిరీస్ను బాయ్కట్ చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సిడ్నీలో టెస్టు ముగియగానే మిగిలిన సిరీసును రద్దు చేసుకోవడంపై బీసీసీఐ సమాలోచనలు జరుపుతోందని బోర్డు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో నాలుగో టెస్టు ఆడేందుకు రానున్న భారత జట్టు కోసం క్వారంటైన్ నిబంధనలను సులభతరం చేసే అవకాశముందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు రాస్ బేట్స్.. ''ఒకవేళ భారత జట్టు ఆ నిబంధనలను పాటిస్తూ క్రికెట్ ఆడలేకపోతే.. ఇక్కడికి రావొద్దు'' అని పేర్కొంది. ''ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించేందుకు అవకాశం లేదు. అవివి పాటించాలనుకుంటేనే భారత జట్టు ఇక్కడికి రావాలి'' అని ఆ రాష్ట్ర క్రీడామంత్రి టిమ్ మాండర్ కూడా స్పష్టం చేశాడు.
ఇక రాస్ బేట్స్ అనవసర వ్యాఖ్యలు చేశారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో కలిసి సిరీసును సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. భారత జట్టుకు నిబంధనలు పాటించడం ఇష్టంలేదన్న తరహాలో ఆమె మాటలు ఉన్నాయని అసహనం వ్యక్తం చేశాడు. అదే నిజమైతే రోహిత్శర్మ 14 రోజులు కఠినమైన క్వారంటైన్లో ఎందుకు ఉన్నాడని ప్రశ్నించారు. ఒక ప్రజాప్రతినిధి మేమక్కిడికి రాకూడదని అనడం బాధాకరమని పేర్కొన్నాడు. అలాగైతే ఏళ్ల తరబడి తమనెంతగానో ప్రేమిస్తున్న ఆస్ట్రేలియా అభిమానులను నిరాశకు గురి చేయక తప్పదని బాయ్ కట్ చేసే ఆలోచనను పరోక్షంగా ప్రస్తావించాడు.