
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయాన్నందుకొని సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. అజింక్యా రహానే సారథ్యంలోనే భారత జట్టుకు రూ.5 కోట్లను బోనస్గా ఇస్తామని తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా టీమిండియాను ప్రశంసిస్తూ ట్వీటర్ వేదికగా నజరానాను ప్రకటించారు.
'ఇది మరవలేని అద్భుత విజయం. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఈ విధంగా మట్టికరిపించి సిరీస్ కైవసం చేసుకోవడం అద్బుతం. భారత క్రికెట్ చరిత్రలోనే ఇది ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత జట్టుకు బోనస్గా బీసీసీఐ రూ.5 కోట్ల ప్రైజమనీని ప్రకటిస్తుంది. వారి అసాధారణ ఆటకు లెక్కకట్టలేం. టూర్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి అభినందనలు'అని గంగూలీ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ రహానేను ఆటగాళ్లను అభినందించాడు. యువ ఆటగాళ్లు అయిన సిరాజ్, శుభ్మన్, రిషభ్ పంత్ల ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడాడు.
'అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత జట్టుకు బోనస్గా రూ. కోట్ల ప్రైజమనీని బీసీసీఐ ప్రకటిస్తుంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదో ప్రత్యేకమైన సందర్భం. అసాధారణమైన ఆటతో టీమిండియా గబ్బాలో అద్భుత విజయాన్నందుకుంది.'అని జైషా ట్వీట్ చేశారు.
బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ మూడు వికెట్లతో అద్భుత విజయాన్నందుకుంది. రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్మన్ గిల్(91) అసాధారణ పోరాటానికి చతేశ్వర్ పుజారా(56), వాషింగ్టన్ సుందర్(22) బాధ్యాతాయుత ఇన్నింగ్స్లు తోడవడంతో ఆసీస్ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. ఫలితంగా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత్కు ఇది రెండో సిరీస్. కానీ తాజా సిరీస్ చాలా ప్రత్యేకం. ఫస్ట్ టెస్ట్లో 36 పరుగులకే కుప్పకూలి తీవ్ర అవమానాన్ని మూటగట్టుకున్న భారత్.. ఆఖరికి ఊహించని రీతిలో సిరీస్ విజయాన్నందుకుంది. భారత జట్టు సాధించిన ఈ గెలుపుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.