
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లోనూ భారత బ్యాట్స్మెన్ వైఫల్యం కొనసాగింది. 36/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ (45), చతేశ్వర పుజారా (17) లను ప్యాట్ కమిన్స్ ఔట్ చేయగా.. క్రీజులో నిలదొక్కుకున్న హనుమ విహారీని(66 బంతుల్లో 21) లయన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో టీమిండియా 116 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(33 బ్యాటింగ్), రిషభ్ పంత్(7 బ్యాటింగ్) ఉన్నారు.
రెండో రోజు ఫస్ట్ సెషన్లోనే గిల్, పుజారాలను కమిన్స్ వరుస ఓవర్లలో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి ఆసీస్కు మంచి శుభారంభాన్ని అందించాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అజింక్యా రహానే, హనుమ విహారి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇద్దరూ ఆసీస్ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్నారు. ఓపికగా ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఇక 50కి పైగా పరుగుల భాగస్వామ్యంతో క్రీజలో నిలదొక్కుకున్న ఈ జోడీని లయన్ దెబ్బతీశాడు. ఫోర్ బాది జోరు మీదున్న విహారిని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన విహారీ.. బంతిని తప్పుగా అంచనా వేసి స్లిప్లో ఉన్న స్మిత్కు చిక్కాడు.
ఇక అడిలైడ్ అపజయాన్ని అల్లంత దూరాన పెడుతూ మెల్బోర్న్ టెస్టును భారత జట్టు మెరుగైన రీతిలో ఆరంభించిన విషయం తెలిసిందే. మన బౌలర్లు మరోసారి మెరవడంతో ఆస్ట్రేలియా మళ్లీ 200 పరుగులు కూడా దాటలేకపోయింది. బుమ్రా పదునైన బౌలింగ్, అశ్విన్ అనుభవ ప్రదర్శనకు తోడు అరంగేట్రం టెస్టులో హైదరాబాదీ సిరాజ్ కూడా ఆకట్టుకోవడంతో ఆసీస్ జట్టులో ఒక్కరూ కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు. దాంతో ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌటైంది. బదులుగా మరోసారి సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... గత మ్యాచ్లో ఘోర పరాభవాన్ని మిగిల్చిన స్కోరు (36) వద్దే మొదటి రోజు ఆట ముగించింది.