
11 ఏళ్ల క్రితం తొలిసారి..
ఆస్ట్రేలియానే ఈ గులాబి బంతి ప్రతిపాదనను తీసుకొచ్చి అమలు చేసింది. 2009లో తొలిసారిగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మహిళల వన్డేలో గులాబీ బంతిని ప్రయోగాత్మకంగా వాడారు. 2010, జనవరిలో గయానా-ట్రినిడాడ్ అండ్ టుబాగో జట్ల మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా పింక్ బాల్తోనే జరిగింది. అలాగే ఇతర దేశాల్లోనూ ఈ తరహా ప్రయోగాలు ఊపందుకున్నాయి.
మొదటి నుంచీ డే/నైట్ టెస్టులపై ఆసక్తి ఉన్న ఆసీస్ 2014లో షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్ను పూర్తిస్థాయిలో గులాబీ బంతితోనే నిర్వహించింది. ఇక అంతర్జాతీయస్థాయిలో తొలి డే అండ్ నైట్ టెస్టు 2015, అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఇందులో ఆతిథ్య జట్టు ఆసీస్ మూడో రోజే 3 వికెట్ల తేడాతో గెలిచింది.

గంగూలీ రాకతో గులాబీకి భారత్ సై..
భారత్ విషయానికి వస్తే.. చాలా ఆలస్యంగానే గులాబీ టెస్టుల్లోకి అడుగుపెట్టింది. అప్పట్లో డీఆర్ఎస్తో పాటు డే అండ్ నైట్ టెస్టులను భారత్ వ్యతిరేకించింది. గత(2018-19) ఆసీస్ పర్యటనలో గులాబీ టెస్టు ఆడేందుకు కూడా భారత్ నిరాకరించింది. అయితే బోర్డు అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ రాకతో పరిస్థితులు మారాయి. గతేడాది తొలిసారిగా ఈడెన్ గార్డెన్ మైదానంలో కోహ్లీ సేన బంగ్లాదేశ్తో ఫస్ట్ డేనైట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ను కోహ్లీసేన రెండు రోజుల్లోనే ముగించింది. ఓవరాల్గా ఇలాంటి మ్యాచ్ ఆడిన తొమ్మిదో జట్టుగా భారత్ నిలిచింది.

గులాబీ ప్రత్యేకత అదే..
1997లో ముంబై-ఢిల్లీ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను రాత్రి వేళ జరిపారు. అయితే ఇందులో తెలుపు బంతిని వినియోగించారు. గులాబీ, ఎరుపు, తెలుపు బంతుల్లో ప్రధాన భాగమంతా ఒక్కటే. కానీ పింక్ బాల్పై ఉన్న లెదర్కు పింక్ పిగ్మెంట్తో కోటింగ్ చేస్తారు. మ్యాచ్ ఆరంభంలో ఇతర బంతులకన్నా ఎక్కువగా ఇవి స్వింగ్ అవుతుంటాయి. ప్రస్తుతం కూకాబుర్రా గులాబీ బంతులకు నల్లటి దారాలతో కుట్టు వేస్తున్నారు. గతంలో ఆకుపచ్చ, తెలుపుతో కూడిన సీమ్ ఉండేది. తొలి గులాబీ టెస్టులో ఈ కాంబినేషన్ స్పష్టంగా కనిపిస్తూ ఆటగాళ్లకు చికాకు పెట్టింది. దీంతో అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫిర్యాదు మేరకు 2016 నుంచి సీమ్లో మార్పు చేశారు.ఎరుపు బంతితో పోలిస్తే రంగు, మెరుపు ఎక్కువ సేపు ఉండేందుకు గులాబీ బంతిపై అదనంగా లక్కతో పూత పూస్తారు.

విదేశీ జట్ల పేలవ ప్రదర్శన
రికార్డు చూస్తే ఒక్క టెస్టులో మినహా ఆస్ట్రేలియా జట్టును ప్రత్యర్థి ఇబ్బంది పెట్టలేకపోయింది. కంగారూలు రెండు మ్యాచ్లలో ఇన్నింగ్స్ విజయాలు సాధించగా, ఒక మ్యాచ్లో 296 పరుగులతో నెగ్గారు. ఏ విదేశీ జట్టు బ్యాటింగ్ సగటు కూడా ఒక్కో వికెట్కు 30 పరుగులకు మించి లేదు. ఒకసారి దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడం మినహా 13 ఇన్నింగ్స్లలోనూ ప్రత్యర్థి జట్లు ఆలౌట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే గులాబీ బంతితో డే-నైట్ టెస్టులు ఆడటంలో అనుభవలేమినే ఈ జట్లలో కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ కూడా అలాంటి స్థితిలోనే పట్టుదల కనబర్చి సిరీస్లో శుభారంభం చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications
