ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గమనాన్ని తేల్చే గబ్బా టెస్ట్లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. టెయిలెండర్ల అసాధారణ ప్రదర్శనకు వర్షం తోడవ్వడంతో ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. 275 పరుగుల లక్ష్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తీవ్రత పెరగడంతో అంపైర్లు మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. దాంతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.
అంతకుముందు 252/9 ఓవర్నైట్ స్కోర్తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 8 పరుగులను జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ బౌలింగ్లో ఆకాశ్ దీప్(44 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31)ఆఖరి వికెట్గా పెవిలియన్ చేరాడు. జస్ప్రీత్ బుమ్రా(10 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

దాంతో ఆసీస్కు 185 పరుగుల ఆధిక్యం లభించింది. భారీ లీడ్తో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్.. 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా(3/18), ఆకాశ్ దీప్(2/28), మహమ్మద్ సిరాజ్(2/38) నిప్పులు చెరగడంతో ఆసీస్ 85 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో నాథన్ మెక్స్వీనీ(4), ఉస్మాన్ ఖవాజా(8), మార్నస్ లబుషేన్(1), మిచెల్ మార్ష్(2), స్టీవ్ స్మిత్(4) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ట్రావిస్ హెడ్(17), అలెక్స్ క్యారీ(19 నాటౌట్), ప్యాట్ కమిన్స్ (22)లు డబుల్ డిజిట్ స్కోర్ చేశారు.
ఈ మ్యాచ్లో ఎలాగైన ఫలితం రాబట్టాలనే ఉద్దేశంతో ఆసీస్.. భారత్ ముందు 275 పరుగుల ఊరించే లక్ష్యాన్ని ఉంచింది. కానీ ఆసీస్ ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగుల భారీ స్కోర్ చేసింది.
తొలి ఇన్నింగ్స్లో శతకంతో చెలరేగిన ట్రావిస్ హెడ్(160 బంతుల్లో 18 ఫోర్లతో 152)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ మ్యాచ్లో ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. విజయం దిశగా సాగిన ఆ జట్టు ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు.
ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా అసాధారణ బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకుంది. ఈ ఇద్దరూ ఆఖరి వికెట్కు 47 పరుగులు జోడించారు. టీమిండియా ఫాలో ఆన్ గండం గట్టెక్కకుంటే ఈ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించేది.
సంక్షిప్త స్కోర్లు
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 445 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 260 ఆలౌట్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 89/7 డిక్లేర్
భారత్ రెండో ఇన్నింగ్స్ 8/0