ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆసీస్ అద్భుతం చేసింది. అసాధారణ ప్రదర్శనతో కొండత లక్ష్యాన్ని చేధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. గ్లేన్ మ్యాక్స్వెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-2తో బోణీ కొట్టింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా తడబడింది. మ్యాక్సీ విధ్వంసాన్ని అడ్డుకోలేక ఓటమికి తల ఒంచింది. ముఖ్యంగా స్పిన్నర్ అక్షర్ పటేల్తో 19వ ఓవర్ బౌలింగ్ చేయించడం టీమిండియా కొంపముంచింది. తొలి రెండు మ్యాచ్ల్లో కట్టుదిట్టమైన యార్కర్లతో ఆకట్టుకున్న ముఖేష్ కుమార్ విలువ ఏంటో తెలుసొచ్చింది.

ఈ మ్యాచ్కు అతన్ని పక్కనపెట్టిన టీమిండియా మేనేజ్మెంట్ ఆవేశ్ ఖాన్ను బరిలోకి దించి మూల్యం చెల్లించుకుంది. ఆసీస్ విజయానికి చివరి 12 బంతుల్లో 43 పరుగులు కావాల్సిన సమయంలో అక్షర్ పటేల్ 19వ ఓవర్ వేయగా.. మాథ్యూ వేడ్.. మూడు ఫోర్లు, ఒక సిక్స్తో 22 పరుగులు పిండుకున్నాడు.
వికెట్ తీయాలనే ఉద్దేశంతో అక్షర్ పటేల్తో టీమిండియా చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. ఈ ఓవర్లో అతను ఒక్క బౌండరీ తక్కువ ఇచ్చినా మూమెంటమ్ టీమిండియా వైపు ఉండేది. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. ప్రసిధ్ కృష్ణ వరుసగా 6, 4, 4, 4 ఇచ్చి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఒక్క యార్కర్ కూడా వేయలేకపోయాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్లతో 123 నాటౌట్) అజేయ శతకం సాధించగా.. సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39), తిలక్ వర్మ(24 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి గెలుపొందింది. గ్లేన్ మ్యాక్స్వెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 104 నాటౌట్) శతకం నమోదు చేయగా.. మాథ్యూ వేడ్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రవి బిష్ణోయ్(2/32) రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.