
బెంగళూరు : మూడు వన్డేల సిరీస్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బుమ్రా వేసిన ఐదో ఓవర్ రెండో బంతిని ఆసీస్ కెప్టెన్ ఫించ్ మిడ్వికెట్ మీదుగా ఆడగా.. ధావన్ డైవ్తో బంతిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అతని ఎడమ భుజం నేలకు గట్టిగా తగిలింది. అనంతరం తన భుజాన్ని కదిలించడానికి ధావన్ ఇబ్బందిపడినట్లు కనిపించింది. దీంతో అతను మైదానం వీడగా.. సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా చహల్ గ్రౌండ్లోకి వచ్చాడు.
అయితే రెండో వన్డేలోనే బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ ధావన్.. మరోసారి ఇంజ్యూరీకి గురవ్వడంతో అతని బ్యాటింగ్పై అనుమానాలు నెలకొన్నాయి. కీలకమైన ఈ మ్యాచ్లో ధావన్ బ్యాటింగ్ సేవలను ఇండియా కోల్పోతే కష్టమే. అతను గత రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధావన్ బ్యాటింగ్.. చేస్తాడా ? అని ఒకరు ప్రశ్నిస్తే. మరొకరు గబ్బర్ బ్యాటింగ్ చేయకపోతే ఇండియా పరిస్థితి ఏంటని మరొకరు కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు ధావన్ గాయంపై టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ నుంచి ధావన్ను గాయాలు వీడటం లేదు. ప్రపంచకప్లో ఆసీస్ మ్యాచ్ సందర్భంగానే ధావన్ గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
అంతకు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్ విన్నింగ్స్ జట్టునే కొనసాగిస్తోంది. మరోవైపు ఆసీస్ మాత్రం ఒక మార్పు చేసింది. పేసర్ రిచర్డ్సన్ స్థానంలో హజిల్వుడ్ జట్టులోకి వచ్చాడు.