బెంగళూరు : మూడు వన్డేల సిరీస్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. బంతిని ఆపే క్రమంలో అతని ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన శిఖర్.. మైదానం వీడగా యజువేంద్ర చహల్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా గ్రౌండ్లోకి వచ్చాడు.
దీంతో ధావన్ బ్యాటింగ్ చేస్తాడా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే అతని గాయంపై బీసీసీఐ స్పందించింది. గాయపడ్డ ధావన్ను ఎక్స్రేకు పంపించామని, అతను రాగానే గాయంపై ఓ అంచనాకు వచ్చి తుది నిర్ణయం వెల్లడిస్తామని ట్వీట్ చేసింది.
'శిఖర్ ధావన్ ఎక్స్రే కోసం వెళ్లిండు. అతను తిరిగి వచ్చాక.. గాయం తీవ్రత తెలుసుకొని బ్యాటింగ్కు పంపించాలా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం' అని పేర్కొంది.
బుమ్రా వేసిన ఐదో ఓవర్ రెండో బంతిని ఆసీస్ కెప్టెన్ ఫించ్ మిడ్వికెట్ మీదుగా ఆడగా.. ధావన్ డైవ్తో బంతిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అతని ఎడమ భుజం నేలకు గట్టిగా తగిలింది. అనంతరం తన భుజాన్ని కదిలించడానికి ధావన్ ఇబ్బందిపడినట్లు కనిపించింది. అయితే రెండో వన్డేలోనే బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ ధావన్.. మరోసారి ఇంజ్యూరీకి గురవ్వడంతో అతను బ్యాటింగ్ చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి.
కీలకమైన ఈ మ్యాచ్లో ధావన్ బ్యాటింగ్ సేవలను ఇండియా కోల్పోతే కష్టమే. అతను గత రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధావన్ బ్యాటింగ్.. చేస్తాడా ? అని ఒకరు ప్రశ్నిస్తే... గబ్బర్ బ్యాటింగ్ చేయకపోతే ఇండియా పరిస్థితి ఏంటని మరొకరు కామెంట్ చేస్తున్నారు.
ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ నుంచి ధావన్ను గాయాలు వీడటం లేదు. ప్రపంచకప్లో ఆసీస్ మ్యాచ్ సందర్భంగానే ధావన్ గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
అంతకు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్ విన్నింగ్స్ జట్టునే కొనసాగిస్తోంది. మరోవైపు ఆసీస్ మాత్రం ఒక మార్పు చేసింది. పేసర్ రిచర్డ్సన్ స్థానంలో హజల్వుడ్ జట్టులోకి వచ్చాడు.