ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న డై/నైట్ టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తరహాలోనే ఈ పింక్ బాల్ మ్యాచ్లో విజయం సాధించి ఈ సిరీస్లో తమ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేయాలనుకుంటోంది. తద్వారా ఆసీస్ గడ్డపై హ్యాట్రిక్ సిరీస్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది.
ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. రెండు రోజుల పింక్ బాల్ సన్నాహక మ్యాచ్ కూడా ఆడింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత్కు ఇది ఐదో పింక్ బాల్ టెస్ట్ మాత్రమే. గతంలో నాలుగు పింక్ బాల్ మ్యాచ్లు ఆడిన టీమిండియా మూడింటిలో గెలిచి ఒక్కదాంట్లో ఓటమిపాలైంది.

అయితే అడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్కు అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్ ప్రారంభమయ్యే తొలి రోజు భారీ వర్ష సూచన ఉంది. శుక్రవారం పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు అడిలైడ్ పిచ్ క్యూరేటర్ డామియన్ హౌ తెలిపాడు. 'శుక్రవారం భారీ వర్షం సూచన ఉంది. వర్షం వచ్చే సమయాన్ని ఖచ్చితంగా చెప్పలేను. కానీ శుక్రవారం మొత్తం వర్షం పడే అవకాశం ఉంది. అయితే శనివారం వర్ష ప్రభావం అంతగా లేదు. మిగతా నాలుగు రోజులు ఆట సజావుగా సాగే అవకాశం ఉంది.'అని డామియన్ పేర్కొన్నాడు.
ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం శుక్రవారం 40 శాతం వర్షం పడే అవకాశం ఉండగా.. శనివారం 14 శాతమే ఉంది. మిగతా మూడు రోజులకు మాత్రం ఎలాంటి వర్ష సూచన లేదు.
ఈ పింక్ బాల్ టెస్ట్కు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టెస్ట్కు దూరమైన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అందుబాటులోకి వచ్చారు. దాంతో వారి స్థానాల్లో ఫస్ట్ మ్యాచ్ ఆడిన దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్పై వేటు పడనుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఒక మార్పు చేయనుంది. గాయపడ్డ హజెల్ వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ ఆడనున్నాడు.