సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ ఛేజింగ్కు అనుకూలంకావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇక జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయని, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మనీష్ పాండే స్థానాల్లో యుజ్వేంద్ర చాహల్, శార్దుల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చారన్నాడు. మనీష్ ఎల్బోకు గాయమైందని, షమీకి విశ్రాంతించినట్లు విరాట్ స్పష్టం చేశాడు.
ఇక అంతా అనుకున్నట్లే ఆసీస్ తమ రెగ్యూలర్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సేవలను కోల్పోయింది. దాంతో మాథ్యూ వేడ్ జట్టును నడిపించనున్నాడు. ఇక హజల్ వుడ్ వెన్నుగాయంతో ఇబ్బంది పడుతుండటంతో అతనికి విశ్రాంతి కల్పించగా.. ఆండ్రూ టై, డీఆర్సీ షార్ట్ తుది జట్టులోకి వచ్చారు. వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి మిచెల్ స్టార్క్ దూరమవడంతో అతని స్థానంలో డానియల్ సామ్స్ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మార్కస్ స్టోయినిస్ కూడా జట్టులోకి తిరుగొచ్చాడు.
ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమిండియా మరో విజయం సాధించి సిరీస్ గెలవాలని చూస్తుంటే.. ఆసీస్ మాత్రం మ్యాచ్ గెలిచి సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. పైగా ఈ ఫార్మాట్లో భారత జట్టు ఓటమెరుగని టీమ్గా దూసుకెళ్తుంది. 2019, డిసెంబరులో విండీస్ చేతిలో చివరిసారిగా పరాజయం చవిచూసింది. ఆ తర్వాత శ్రీలంక, కివీస్లపై వరుసగా నెగ్గింది.
తుది జట్లు:
భారత్: కోహ్లీ (కెప్టెన్), ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, సుందర్, దీపక్ చహర్, నటరాజన్, శార్దుల్ ఠాకుర్, చాహల్.
ఆస్ట్రేలియా: డీఆర్సీ షార్ట్, మాథ్యూ వేడ్(కెప్టెన్), స్మిత్, మ్యాక్స్వెల్, హెన్రిక్స్, మార్కస్ స్టోయినిస్, అబాట్, డానియల్ సామ్స్, స్వెప్సన్, జంపా, ఆండ్రూ టై