
నాగ్పూర్: భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా మరికొద్ది సేపట్లో ప్రారంభం కావాల్సిన రెండో టీ20 మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ను ఆలస్యంగా ప్రారంభించనున్నారు. ఔట్ ఫీల్డ్ ఇంకా ఆరకపోవడంతో అంపైర్లు మరో 45 నిమిషాల సమయాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా ఔట్ ఫీల్డ్లోని ఓ భాగం జారుతుందని, ఇది ఆటగాళ్లకు ప్రమాదమని అంపైర్లు బ్రాడ్కాస్టర్కు సమాచారమిచ్చారు. గ్రౌండ్స్మెన్ ఆ ప్రదేశాన్ని పొడిగా చేసేందుకు కృషి చేస్తున్నారని రాత్రి 8.45 గంటలకు మరోసారి మైదానాన్ని పరీక్షిస్తామని చెప్పారు. ఇక ఈ మ్యాచ్ సజావుగా జరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మైదానాన్ని మబ్బులు కమ్మేసాయి. మళ్లీ వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ అదే జరిగితే ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. పిచ్ రిపోర్ట్ ఇచ్చిన హోస్ట్ రవి శాస్త్రి మబ్బులు కమ్మేసాయని, చాలా తేమగా ఉందని చెప్పాడు. మాములుగా అయితే ఇక్కడ టాస్ గెలిచిన జట్లు బ్యాటింగ్ చేస్తాయని, కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉందన్నాడు. పిచ్పై కవర్లు కప్పేసి ఉంచడంతో నల్లగా మారిందని, డ్రైగా ఉందన్నాడు. పేస్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉందని, టర్న్ కూడా లభిస్తుందన్నాడు. 150 పరుగులు చేయడం గొప్పవిషయమని అభిప్రాయపడ్డాడు.
సిరీస్పై ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరి ఈ మ్యాచ్కు జట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపని వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్థానంలో రిషభ్ పంత్కు అవకాశం కల్పిస్తారా? ఆసీస్తో తొలి టీ20లో దినేశ్ కార్తీక్ను జట్టులోకి తీసుకున్నా ఆకట్టుకోలేకపోయాడు. కీపింగ్లో పెద్దగా మాయ చేయని కార్తీక్.. బ్యాటింగ్లోనూ విఫలమయ్యాడు. కేవలం 6 పరుగులకే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో రెండో టీ20లో అతడి స్థానంలో పంత్ను తీసుకోవాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక, గత మ్యాచ్లో బౌలింగ్ వైఫల్యం ప్రధానంగా కన్పించింది. ముఖ్యంగా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో అతడిని పక్కన పెట్టాలనే అభిప్రాయాలున్నాయి. ఇటీవలే ఫిట్నెస్ సాధించిన బుమ్రా తిరిగి జట్టులోకి రావొచ్చు. ఈ విషయాన్ని రోహిత్ కూడా సూచనప్రాయంగా చెప్పాడు. అయితే బుమ్రాను ఉమేశ్ స్థానంలో తీసుకునే అవకాశాలున్నాయి. ఇవి మినహా పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు.