రాజ్కోట్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్తో 96) ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 30 వ ఓవర్లో రిచర్డ్సన్ వేసిన బంతిని ధావన్ భారీ షాట్ ఆడగా.. అదికాస్త ఫైన్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్ చేతిలో నేరుగా పడింది. దీంతో ధావన్ సెంచరీ చేజారింది. రెండో వికెట్కు నమోదైన 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ జంపా బౌలింగ్లో బౌల్డ్ అయి (7 ) తీవ్రంగా నిరాశపరిచాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్(10 బ్యాటింగ్)తో కెప్టెన్ విరాట్ కోహ్లీ(50 బ్యాటింగ్) ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో 50 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 35 ఓవర్లలో ఇండియా స్కోర్ 224/3.
గర్జించిన గబ్బర్..
తొలి వన్డేలో కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ధావన్(74) తన ఫామ్ను కొనసాగించాడు. రోహిత్(42)తో కలిసి తొలి వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ఓపెనర్.. ఆస్ట్రేలియాపై తనదైన మార్క్ పెర్ఫామెన్స్ చూపిస్తున్నాడు.
అంతకుముందు టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫలితంగా టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది.ఈ మ్యాచ్లో కోహ్లీసేన రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్లో గాయపడ్డ రిషబ్ పంత్, భారీగా పరుగులిచ్చిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో మనీష్ పాండే, నవదీప్ సైనీలను తీసుకుంది.
ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో మనీష్ పాండే 2018 తర్వాత భారత్ తరుపున వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. చివరగా మనీష్ పాండే 2018 సెప్టెంబర్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఆసియా కప్లో వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ మధ్య కాలంలో అతడు 35 వన్డేలను మిస్సయ్యాడు. టాస్ అనంతరం పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉందని, తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ తెలిపాడు.