ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి టీమిండియా సిద్దమైంది. మరికొన్ని గంటల్లో పెర్త్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ సన్నాహకాలను పూర్తి చేసుకొని మైదానంలోకి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఈ మ్యాచ్ ముందు ఇరు జట్ల కెప్టెన్లు తమ ప్రిపరేషన్స్పై ధీమా వ్యక్తం చేశారు. మెరుగైన ప్రదర్శన చేస్తామని చెప్పారు.
సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం చాలా ముఖ్యం. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా సొంతగడ్డపై టెస్ట్ సిరీస్లో వైట్వాష్ అవ్వడం ఇదే తొలిసారి. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియా ఇజ్జత్కు సవాల్గా మారింది. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే ఈ సిరీస్ను టీమిండియా 4-0తో గెలుచుకోవాలి.

కుర్రాళ్లతో టీమిండియా..
మరోవైపు గత రెండు పర్యటనల్లో ఆసీస్ గడ్డపై టీమిండియా విజయం సాధించింది. గత నాలుగు పర్యాయాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియానే విజేతగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఘోర పరాజయంతో ఢీలా పడిన భారత్ను ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆసీస్ భావిస్తోంది. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు భారత జట్టులోని చాలా మందికి ఆసీస్ పర్యటన ఇదే తొలిసారి. సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ ఇప్పటి వరకు ఆసీస్ తరహా పేస్ పిచ్లపై ఆడలేదు.
వర్షం ముప్పు..
ఇక పెర్త్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్కు వర్షం ముప్పు పొంచి ఉంది. టాస్ సమయంలో అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం పెర్త్లో అన్సీజనల్ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం 25 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వర్ష ప్రభావం కాసేపే కొనసాగనుంది. అది కూడా తొలి రోజు మాత్రమే.
చివరి నాలుగు రోజులు ఎలాంటి వర్షం లేదు. కాకపోతే వర్షం కారణంగా పిచ్ సహజ స్వభావం కోల్పోయే అవకాశం ఉంది. మాములుగా పిచ్పై పగుళ్లు ఏర్పడి మూడు, నాలుగో రోజు బౌలర్లకు అనుకూలంగా ఉండేది. కానీ చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా పిచ్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. దాంతో పేస్, బౌన్స్కు అనుకూలంగా ఉండనుంది. ఆరంభంలో కాస్త ఓపికగా ఆడితే.. బ్యాటర్లు పండుగ చేసుకోవచ్చు.