India vs Australia 1st T20: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ పరాజయం మరవకముందే టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. వరల్డ్ కప్ 2023 ఛాంపియన్ ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ వైజాగ్ వేదికగా గురువారం జరగనుంది. ఇరు జట్లలో సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు.
టీమిండియా అయితే పూర్తిగా కుర్రాళ్లతో బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్ ఆడిన ప్రధాన జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఈ సిరీస్లో కొనసాగుతున్నాడు. బెంచ్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, ప్రసిధ్ కృష్ణలకు అవకాశం దక్కింది. మిగతా ఆటగాళ్లంతా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన వాళ్లే. ఇప్పటికే ఇరు జట్లు వైజాగ్ చేరి ఈ మ్యాచ్ కోసం సిద్దమయ్యాయి.

గురువారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ నడిపించనుండగా.. ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ సారథ్యం వహిస్తున్నాడు. ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టోయినీస్, టీమ్ డేవిడ్లు మాత్రమే సీనియర్ ఆటగాళ్లు కాగా.. మిగతా వాళ్లంతా కుర్రాళ్లే.
అయితే ఈ మ్యాచ్కు వర్ష గండం పొంచి ఉంది. మధ్యాహ్నం అనంతరం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వైజాగ్ వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణంగా ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడే ఈ ఏడాది మార్చిలో జరిగిన వన్డేలో ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2019లో జరిగిన టీ20లోనూ ఆస్ట్రేలియానే విజయం వరించింది.
తుది జట్లు(అంచనా)
భారత్: ఇషాన్ కిషన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ/ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టోయినీస్, టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్