
కాన్బెర్రా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. వన్డేల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. సచిన్ 300 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని దాటగా... కోహ్లీ తన 242వ ఇన్నింగ్స్లోనే అందుకున్నాడు.
ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డుకు 23 పరుగులు దూరంలో నిలిచిన విరాట్.. అబాట్ వేసిన 13వ ఓవర్ ఫస్ట్ బాల్కు మిడాఫ్ దిశగా ఆడి క్విక్ సింగిల్తో 12000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనతను అందుకున్న ఆరో బ్యాట్స్మెన్గా విరాట్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్(18426), సంగక్కర(14234), పాంటింగ్(13704), జయసూర్య (13430), జయవర్దనే (12650) కోహ్లీ కన్నా ముందున్నారు. అయితే వీరందరి కన్నా తక్కువ ఇన్నింగ్స్ల్లోనే కోహ్లీ ఈ ఘనతను అందుకోవడం విశేషం.
ఇక మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 123 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనింగ్ జోడీ మార్చినా.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగినా టీమిండియా ఆట మాత్రం మారలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్(16) దారుణంగా విఫలమవ్వగా.. మయాంక్ స్థానంలో జట్టులోకి వచ్చిన శుభ్మన్ గిల్(33) కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఇక శ్రేయస్ అయ్యర్(19), రాహుల్(5) కూడా నిరాశపరచడంతో భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(50), పాండ్యా(1) ఉన్నారు.