
హైదరాబాద్: యువ ఆటగాళ్లకు చక్కని వేదికైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని అండర్-19 భారత జట్టు కెప్టెన్ ప్రియమ్ గార్గ్ తెలిపాడు. బుధవారం హలో యాప్ లైవ్ సెషన్లో పాల్గొన్న ఈ యువ ప్లేయర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఐపీఎల్తో సీనియర్ క్రికెటర్లను కలవచ్చని, వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని ఈ యువ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.
డ్రెస్సింగ్ రూంలో వారి అనుభవాలు, సమన్వయం చేసుకునే విధానం, క్రమశిక్షణ తెలుసుకోవచ్చన్నాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్ కోసం జరిగిన వేలంలో ప్రియమ్ గార్గ్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. కోటి 90 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రూ. 20 లక్షల బేస్ ప్రైజ్తో అతను వేలంలో రాగా.. ఈ యువ ప్లేయర్ కోసం ప్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు హైదరాబాద్ దక్కించుకుంది.
ఇక సచిన్ తన ఆరాధ్య దైవం అని తెలిపిన ప్రియమ్.. మాస్టర్ ఆటను చూసే క్రికెటర్ కావాలనుకున్నాని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు సచిన్ను ఫేస్ టు ఫేస్ చూడలేదన్న ఈ యువ క్రికెటర్.. ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువుతో క్రికెట్ ఆడుతానని, అవి పండ్లైనా.. ఏవైనా తనకు బంతులేనని చెప్పుకొచ్చాడు. ట్రైనింగ్ కోసం రోజు 30 కిలోమీటర్లు ప్రయాణించేవాడినని, తన సీనియర్లు ఎంతో మద్దుతుగా నిలిచేవారని తెలిపాడు. ప్రస్తుతం తన కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
జీవితంలో తన తల్లి మరణం ఎంతో కుంగదీసిందని, కానీ తన సోదరీ, తండ్రి అండగా నిలిచారన్నాడు. రంజీల్లో డబుల్ సెంచరీ చేయడం ఎప్పటికీ మరిచిపోలేని క్షణమని తెలిపిన ప్రియమ్.. జూనియర్ స్థాయిలో చేసినా.. ఆ డబుల్ సెంచరీతో తన కల సాకారమైనట్లు అనిపించిందన్నాడు. వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ తనకు ఆదర్శమని, తన తండ్రి కష్టం తనకు స్పూర్తిదాయకమని చెప్పుకొచ్చాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడటంపై స్పందిస్తూ.. ఆరోజు తమ సాయశక్తుల 100 శాతం విజయం కోసం ప్రయత్నించామని, అది తమ కలని, కానీ కలిసిరాలేదన్నాడు. ఇక టోర్నీ ఆద్యాంతం ఆదిపత్యం కనబర్చిన యువ భారత్.. ఫైనల్లో బంగ్లాదేశ్తో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ప్రియమ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.