అండర్ 19 ప్రంచకప్లో తొమ్మిదోసారి ఫైనల్ చేరడంపై భారత కెప్టెన్ ఉదయ్ సహరన్ సంతోషం వ్యక్తం చేశాడు. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఉదయ్ సహరన్ అద్భుత బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్ను సచిన్దాస్(95 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 96)తో కలిసి ఉదయ్ సహరన్(124 బంతుల్లో 6 ఫోర్లతో 81) ఆదుకున్నాడు. ఐదో వికెట్కు 171 పరుగులు జోడించాడు. విన్నింగ్ నాక్ ఆడిన ఉదయ్ సహరన్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ విజయానంతరం మాట్లాడిన ఉదయ్ సహరన్.. చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నానని, దాంతోనే ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని తెలిపాడు.
'నా బ్యాటింగ్పై నాకు నమ్మకం ఉంది. క్రీజులోకి అడుగుపెట్టినప్పుడే మ్యాచ్ ముగిసేవరకు ఆడాలని నిర్ణయించుకున్నా. ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పితే విజయం సాధించడం కష్టం కాదని తెలుసు. ఎలాంటి రిస్కీ షాట్స్ ఆడకుండా మ్యాచ్ను చివరి వరకు తీసుకోవాలనుకున్నా. నా ఇన్నింగ్స్లో నేను 6 ఫోర్లు మాత్రమే కొట్టాను.
నెమ్మదిగా ఆడినందుకు నాకు ఎలాంటి బాధ లేదు. ఇలా ఆడటం మా నాన్ని నుంచి నేర్చుకున్నాను. ఆయన కూడా క్రికెటర్ కావాలనుకున్నారు. అవసరమైతే ఇన్నింగ్స్ చివర్లో ధాటిగా ఆడాలనుకున్నా. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే క్రీజులో ఉండటం ముఖ్యమని భావించా.
నేను బ్యాటింగ్కు వచ్చే సమయానికి బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుంది. పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలంగా ఉంది. దాంతో బంతి పాతబడే వరకు ఆచితూచి ఆడాం. కాస్త ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. సచిన్ దాస్కు కూడా చివరి వరకు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించమని చెప్పా. ఇద్దరం నిలబడితేనే విజయం సాధిస్తామని చెప్పా. మా కోచింగ్ స్టాఫ్ కూడా మాకు అండగా నిలిచింది. నా కెప్టెన్సీలో ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉంది. ఫైనల్లోనూ ఇదే తరహా ప్రదర్శనను కనబరుస్తాం.'అని ఉదయ్ సహరన్ చెప్పుకొచ్చాడు.