
న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటకు వెళ్లే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చేతన శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శనివారం వెల్లడించింది. ఊహించినట్లుగానే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లందరికీ ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ పర్యటనకు ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా.. సెలెక్షన్ కమిటీ అతన్ని ఎంపిక చేయలేదు. విశ్రాంతి సమయాన్ని పొడిగించింది. దాంతో విరాట్ ఆసియాకప్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్కు ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇచ్చారు. వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్గా దుమ్మురేపిన శిఖర్ ధావన్కే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. గాయంతో జట్టుకు దూరంగా ఉన్న దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్లు ఈ పర్యటనతో మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఐపీఎల్ 2022 సీజన్కు ముందు గాయపడ్డ దీపక్ చాహర్ మళ్లీ ఇన్నాళ్లకు మైదానంలోకి బరిలోకి దిగుతున్నాడు. కౌంటీ క్రికెట్లో సత్తా చాటుతున్న సుందర్ సైతం చాలా రోజుల మళ్లీ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.
రాహుల్ త్రిపాఠి మరోసారి భారత జట్టు పిలుపు ను అందుకోగా.. సిరాజ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణలు కొనసాగుతున్నారు. ఆగస్టు 18 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆగస్టు 18న తొలి వన్డే, 20న రెండో వన్డే, ఆగస్టు 22న మూడో వన్డే జరగనుంది. ఈ పర్యటన అనంతరం ఆసియాకప్ మొదలు కానుంది.
జింబాబ్వేతో వన్డే సిరీస్కు ఎంపికైన భారత జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్