
ముంబై: మూడు వన్డేల కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కెప్టెన్ను మార్చిన 24 గంటల వ్యవధిలోనే కోచ్ను కూడా మార్చారు. రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు విశ్రాంతినిస్తూ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్కు మరోసారి తాత్కలిక కోచ్ బాధ్యతలు అప్పగించారు. జింబాబ్వేతో ఈ నెల 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ ఆడబోతున్న భారత జట్టుకు అతను కోచ్గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరించాడు.
'ప్రధాన కోచ్ ద్రవిడ్ విశ్రాంతి ఏమీ తీసుకోవట్లేదు. నెలాఖర్లో మొదలయ్యే ఆసియా కప్ కోసం అతను జట్టుతో కలిసి 23నే యూఏఈకి చేరుకోవాల్సి ఉంది. దీంతో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న మరో జట్టుకు లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తాడు. ఆసియా కప్ జట్టులో ఉన్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, దీపక్ హుడా మాత్రమే జింబాబ్వేకు వెళ్తున్నారు. వాళ్లిద్దరూ పర్యటన ముగిశాక నేరుగా అక్కడి నుంచి యూఏఈకి చేరుకుంటారు'' అని షా తెలిపాడు. లక్ష్మణ్ ఇంతకుముందు ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడిన భారత జట్టుకు తాత్కలిక కోచ్గా వ్యవహరించాడు.

గాయం, కరోనా కారణంగా పలు అంతర్జాతీయ సిరీస్లకు దూరంగా ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ టెస్ట్ పాసయ్యాడు. దాంతో అతన్ని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయడంతో పాటు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ముందుగా శిఖర్ ధావన్ను కెప్టెన్గా ప్రకటించినప్పటికీ.. రాహుల్ అందుబాటులోకి రావడంతో కెప్టెన్గా ప్రకటించారు. రాహుల్ డిప్యూటీగా ధావన్ను నియమించారు. ఐపీఎల్ 2022 తర్వాత గాయాలు, ఆపరేషన్, ఫిట్ నెస్, కరోనా తదితర కారణాల వల్ల వరుసగా టీమిండియా ఆడిన పలు సిరీస్లకు రాహుల్ దూరమయ్యాడు.
నేరుగా ఆసియా కప్ ఆడటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో అతన్ని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేశారు. కావాల్సిన రిథమ్ అందుకోవాలని, మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.