హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూలై-ఆగస్టు మధ్యలో రెండు టెస్ట్లు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. అయితే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన వెంటనే ఈ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ కంటే ముందు క్రిక్బజ్ ఈ పర్యటన షెడ్యూల్ను వెల్లడించింది. జూల్ 12 నుంచి ఆగస్ట్ 13 వరకు ఈ పర్యటన కొనసాగుతుందని తమ కథనంలో పేర్కొంది.

ముందుగా రెండు టెస్ట్ల సిరీస్ జరగనుందని, జూలై 12-16 మధ్య తొలి టెస్ట్, జూలై 20-14 మధ్య రెండో టెస్ట్ జరగనుందని తెలిపింది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్లకు ట్రినిడాడ్లోని డొమినికా, బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తాయని పేర్కొంది.
మూడు వన్డేల సిరీస్ జూలై 27 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగుతుందని, తొలి వన్డే జూలై 27న, రెండో వన్డే జూలై 29న, మూడో వన్డే ఆగస్టు 1న జరగనుందని క్రిక్ బజ్ తెలిపింది. ఐదు టీ20ల సిరీస్ ఆగస్టు 4 నుంచి 13వరకు జరగనుంది. తొలి టీ20 ఆగస్టు 4, రెండో టీ20 ఆగస్టు6న, మూడో టీ20 ఆగస్టు 8న, నాలుగో టీ20 ఆగస్టు 12న, ఐదో టీ20 ఆగస్టు 13న జరుగుతుందని పేర్కొంది.
ఈ మూడు సిరీస్లను ఓటీటీ ఫ్లాట్ఫామ్ జియోసినిమా ఉచితంగా ప్రసారం చేయనుంది. టీవీలో భారత ప్రభుత్వానికి చెందిన స్టార్ స్పోర్ట్స్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
ఇప్పటికే ఐపీఎల్ను ఫ్రీగా అందించి క్రికెట్ అభిమానులను మనసులను గెలుచుకున్న జియో సినిమా.. కమర్షియల్గా రూపాయి ఆదాయం రాని వెస్టిండీస్ పర్యటనను ఉచితంగా ప్రసారం చేసేందుకు ముందుకు వచ్చి మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. ఈ మేరకు వెస్టిండీస్ అధికారిక ఓటీటీ బ్రాడ్కాస్టర్ ఫ్యాన్ కోడ్తో జియో సినిమా ఒప్పందం చేసుకుంది.
వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్లు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆడనుండగా.. టీ20 సిరీస్ మాత్రం హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ద్వితీయ శ్రేణి టీమ్ ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు ఈ సిరీస్లో అవకాశం ఇవ్వనున్నారు.