హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిసిన అనంతరం టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూలై-ఆగస్టు మధ్యలో రెండు టెస్ట్లు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. అయితే ఈ పర్యటన విండో ఖరారైనా షెడ్యూల్ ఇంకా ఫైనల్ చేయలేదు.
ఈ ఏడాది తీరిక లేని క్రికెట్ ఆడుతున్న టీమిండియా.. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్పైనే ఫోకస్ పెట్టనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడనుంది. టీ20లకు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టును బీసీసీఐ తీర్చిదిద్దుతోంది.

2024 టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసింది. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి యువ ఆటగాళ్లే టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనలోని ఐదు టీ20ల సిరీస్కు కూడా యువ ఆటగాళ్లనే ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్ నుంచి సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ 2023 సీజన్లో సత్తా చాటిన యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్లతో పాటు గుజరాత్ టైటాన్స్ వెటరన్ పేసర్ మోహిత్ శర్మలకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లకు హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా వ్యవహరించాడు.
అతనికి డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ గాయం నేపథ్యంలో అతను వన్డే టీమ్లోకి వెళ్తే.. ఇషాన్ కిషన్ వైస్ కెప్టెన్గా కొనసాగే అవకాశం ఉంది. అయితే యశస్వీ జైస్వాల్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో ఆడే అవకాశం ఉంది. రింకూ సింగ్ ఫినిషర్గా సత్తా చాటనున్నాడు. వికెట్ కీపర్ సంజూ శాంసన్కు జితేశ్ శర్మ నుంచి పోటీ ఎదురవ్వనుంది.