ఒకేసారి రెండు జట్లు..
చాలా ఏళ్ల తర్వాత భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతుంది. విరాట్ కోహ్లీ, రోహిత్, బుమ్రా, షమీ సహా 20 మందితో కూడిన జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. అక్కడ జూన్ 18-22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్తో కోహ్లీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 మధ్య ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది.

కోచ్గా ద్రవిడ్..
ఇక ప్రధాన జట్టులో చోటు దక్కని సీనియర్లు, ఐపీఎల్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో కూడిన ఓ జట్టును బీసీసీఐ శ్రీలంక పర్యటనకు పంపనుంది. ఇప్పటికే ఈ టూర్పై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు జట్లు ఆడటం తప్పనసరన్నాడు. అయితే ఈ జట్టును శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యాల్లో ఒకరు నడిపించనున్నారు. శిఖర్ ధావన్కే కెప్టెన్సీ బాధ్యతలు దక్కనున్నాయి. ఇక ప్రధాన జట్టుతో పాటే చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ఇంగ్లండ్ వెళ్లబోతున్నారు. దాంతో లంక వెళ్లే జట్టుకి టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నారు.

జూలై 5న పయనం..
భారత జట్టు జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి.. 28న తిరుగు పయనంకానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సిరీస్లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియాలు లంక వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












