
న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. సౌతాఫ్రికాతో జరిగే అప్కమింగ్ టెస్ట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇటీవలే వైస్ కెప్టెన్గా ప్రమోషన్ అందుకున్న పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో అనూహ్యంగా ఈ సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. దాంతో కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
తొడ కండరాల గాయంతో చివరి నిమిషంలో ఈ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ టెస్ట్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించనున్నానడని తెలిపింది.
సౌతాఫ్రికా పర్యటనకు ముందు ముంబైలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో రోహిత్ గాయపడ్డాడు. దాంతో గుజరాత్ ప్లేయర్ ప్రియాంక్ పాంచల్ను అతని స్థానంలో బీసీసీఐ ఎంపిక చేసింది. టెస్ట్ సిరీస్కు దూరమైనా.. వన్డే సిరీస్కు రోహిత్ అందుబాటులోకి వస్తాడని తెలిపింది. గాయంతో ఈ సిరీస్కు దూరమైన రోహిత్.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చేరాడు. అక్కడ గాయం నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటున్నాడు. అయితే రోహిత్ గాయం తీవ్రతపై క్లారిటీలేదు. మాములుగా గ్రేడ్-1 టియర్ అయితే 3 నుంచి 4 వారాల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్లు సైతం ఈ సిరీస్కు గాయాలతోనే దూరమయ్యారు. ఇక ఈ సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును సౌతాఫ్రికాకు పంపించింది. డిసెంబర్ 26-30 వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. జనవరి 3-7 వరకు జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్ట్, జనవరి 11-15 వరకు కేప్టౌన్లో మూడో టెస్ట్ జరగనుంది. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ముందు షెడ్యూల్ ప్రకారం నాలుగు టీ20 సిరీస్ కూడా జరగాల్సి ఉండగా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేసారు.