
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్-ఏ జట్టులో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపింది. జట్టులోని ఇద్దరు సభ్యులకు పాజిటీవ్ వచ్చినట్లు వార్తలు రావడంతో భారత ఆటగాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరో రెండు రోజుల్లో సౌతాఫ్రికా బయల్దేరనున్న టీమిండియా సీనియర్ టీమ్ సైతం ఈ వార్తలు విని ఆందోళనకు గురైంది. అయితే పాజిటీవ్ నిర్దార్ణ అయిన కోచింగ్ స్టాఫ్లోని ఇద్దరికి రెండోసారి పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బ్లూంఫాంటేన్ వేదికగా భారత-ఏ, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తొలుత ఇద్దరు టీమిండియా కోచ్లకు కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్గా తేలి, రెండోసారి జరిపిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ముందుగా చేసిన టెస్ట్ రిజల్ట్స్ తప్పని క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నిర్దారించినట్లు కూడా ప్రచారం జరిగింది.
అయితే రెండోసారి పరీక్షల్లో భారత జట్టు సభ్యులందరికీ నెగటీవ్ రావడంతో మ్యాచ్ను యధాతథంగా కొనసాగిస్తున్నారు. ముందుగా పాజిటివ్ వచ్చిన ఇద్దరు కోచ్లను ముందు జాగ్రత్తగా క్వారంటైన్కు తరలించినట్లు తెలుస్తోంది.
కాగా, భారత-ఏ బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతులే, బ్యాటింగ్ కోచ్గా సితాన్షు కోటక్, ఫీల్డింగ్ కోచ్గా శుభ్దీప్ ఘోష్లను బీసీసీఐ సౌతాఫ్రికాకు పంపింది. ఇదిలా ఉంటే, కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే టీమిండియా సౌతాఫ్రికా పర్యటన వారం ఆలస్యంగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తొలి టెస్ట్ డిసెంబర్ 26న, రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్లో చివరిదైన మూడో టెస్ట్ జనవరి 11న జరగనున్నాయి. అనంతరం మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇక నాలుగు టీ20ల సిరీస్ను ఈ ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసారు.