హైదరాబాద్: కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో టీమిండియా.. సౌతాఫ్రికా పర్యటనపై నెలకొన్న సస్పెన్స్కు తెరదించుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ అండ్ టీమ్.. సఫారీ టూర్కు వెళ్లడం ఖాయమని, అయితే ముందుగా అనుకున్న విధంగా డిసెంబర్ 17 నుంచి కాకుండా 26 నుంచి సిరీస్ మొదలవ్వనుందని తెలిపింది. అంతేకాకుండా ముందుగా ఈ పర్యటనలో షెడ్యూల్ చేసిన టీ20 సిరీస్ను తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసామని పేర్కొంది. కోల్కతా వేదికగా గత శనివారం జరిగిన బీసీసీఐ వార్షిక జనరల్ మీటింగ్(ఏజీఎమ్)లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
భారత్ X సౌతాఫ్రికా రివైజ్డ్ షెడ్యూల్ ఇదే!#IndvsSA pic.twitter.com/eEkzpG9xBg
— uppala shivaprasad (@shivauppala93) December 7, 2021
ఇక రివైజ్డ్ షెడ్యూల్ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. మూడు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్ సెంచూరియన్ వేదికగా డిసెంబరు 26న మొదలు కానుంది. 2022 జనవరి 3-7 మధ్య జొహాన్నెస్బర్గ్లో రెండో టెస్టు, 11-15 మధ్య కేప్టౌన్లో మూడో టెస్టు జరుగుతాయి. వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లు వరుసగా జనవరి 19, 21, 23 తేదీల్లో నిర్వహిస్తారు. తొలి రెండు వన్డేలు పార్ల్ వేదికగా జరగనుండగా.. మూడో వన్డేకు కేప్టౌన్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు ఇప్పటిదాకా టెస్టు సిరీస్ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికానే. ఈ పర్యటనలో అయినా ఆ లోటు తీర్చుకోవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది.
ఇప్పటికే టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతలను వదిలిన విరాట్ కోహ్లీని వన్డే సారథిగా కొనసాగిస్తారా? అనేది చర్చనీయాంశమైంది. టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మకే వన్డే కెప్టెన్సీ కూడా ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది. సౌతాఫ్రికా పర్యటనలో భారత్ మూడు వన్డేల సిరీస్లో ఆడనున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది.
అయితే బీసీసీఐ అధికారులు మాత్రం.. వన్డే కెప్టెన్సీ మార్పుకు మరింత సమయం పట్టవచ్చంటున్నారు. ఈ ఏడాది భారత్కు పెద్దగా వన్డే సిరీస్ల్లేవ్ కాబట్టి.. ఇప్పట్లో ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చని ఓ అధికారి తెలిపారు. ఇక టెస్ట్ల్లో పేలవ ఆటతీరుతో జట్టులో చోటు కోల్పోయిన రహానే వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోనున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో తుది జట్టులో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తదుపరి వైస్ కెప్టెన్గా రోహిత్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.