ఒకే ఒక్క ప్రెస్ మీట్.. ఖేల్ ఖతమ్! ఇక భారత్ బంగ్లా క్రికెట్ సిరీస్ లేనట్లే!
గతేడాది వాయిదా పడిన టీమిండియా.. బంగ్లాదేశ్ పర్యటన గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే దేశరాజధాని ఢిల్లీలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన ప్రెస్ మీట్.. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలకు దారి తీసింది. దాంతో భారత్ బంగ్లాదేశ్ సిరీస్ జరగడం అసాధ్యంగా కనిపిస్తోంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో శరణార్థిగా తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న అల్లర్ల సమయంలో ఆమె భారత్కు పారిపోయి వచ్చారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం మారింది. తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న షేక్ హసీనాను తమకు అప్పజెప్పాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
భారత్తో స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగించలేం..
ఈ పరిస్థితుల్లో గత బుధవారం(ఆగస్ట్ 5) షేక్ హసీనా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ప్రెస్మీట్లో షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలను బంగ్లా ప్రభుత్వం ఖండించింది. 'షేక్ హసీనా ఢిల్లీ నుంచి చేసిన వ్యాఖ్యలు మన దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే భారత్తో స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగించలేం.'అని శనివారం బంగ్లాదేశ్ హోమ్ మంత్రి సలాహుద్దీన్ అహ్మద్ అన్నారు.

ఈ రాజకీయ సంఘర్షణల కారణంగా సెప్టెంబర్లో జరగాల్సిన భారత్ బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.. భారత జట్టును ఆహ్వానించి సిరీస్కు ఆతిథ్యం ఇవ్వడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. బంగ్లాదేశ్కు ఆర్థికంగా.. వాణిజ్యపరంగా భారత జట్టు పర్యటన చాలా ముఖ్యం.
భారత్ బంగ్లాదేశ్ సిరీస్ రద్దు..
గతంలో రాజకీయ పరిస్థితుల కారణంగానే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. భద్రతా కారణాలు చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని కోరింది. ఈ విజ్ఞప్తికి ఐసీసీ అంగీకరించకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకుంది. దాంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి దిగింది. భారత్ బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్ సాధ్యసాధ్యాలపై ఆ దేశ క్రికెట్ బోర్డు సందేహం వ్యక్తం చేసింది.
ఇటీవల ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిమాణాలతో భారత్ బంగ్లాదేశ్ సిరీస్ నిర్వహణ సందేహాస్పదంగా మారిందని బీసీబీ అధికారి ఒకరు అన్నారు. ఈ విషయమై ఆగస్ట్ 28లోగా నిర్ణయాలు తీసుకోవాలని, కానీ ఇప్పటి వరకు భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్లే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

