
హైదరాబాద్: గాయంతో టీ20 ప్రపంచకప్కు దూరమవ్వడంపై జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. మెగా టోర్నీ ఆడే అవకాశం చేజార్చుకోవడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. తాను కోలుకోవాలని కోరుకున్న పత్రీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పిన బుమ్రా.. ఆస్ట్రేలియా వెళ్లి టీమిండియాకు మద్దతు తెలుపుతానని ట్వీట్ చేశాడు. వెన్నుగాయంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న బుమ్రా.. మెగా టోర్నీ కూడా ఆడటం లేదని బీసీసీఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది.
వెన్నులో ఫ్రాక్చర్ కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా... ప్రస్తుతం ఎన్సీఏలో రిహాబిలిటేషన్లో ఉన్నాడు. 'బుమ్రా గాయం తగ్గడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ప్రపంచకప్లో ఆడలేడు. మెడికల్ రిపోర్ట్స్, నిపుణుల సలహాలు, సూచనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం'అని బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించాడు. బుమ్రాకు రీప్లేస్మెంట్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.
ఈ క్రమంలోనే ట్విటర్ వేదికగా స్పందించిన బుమ్రా.. ఆడినా ఆడకున్నా ఆస్ట్రేలియా వెళ్తానని తెలిపాడు. 'ఈసారి నేను ప్రపచంకప్ ఆడటం లేదు. కానీ నేను కోలుకోవాలని విష్ చేసిన నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నేను కోలుకున్న తర్వాత ఆసీస్ వెళ్లి భారత జట్టుకు మద్దతు తెలుపుతా'అని బుమ్రా ట్వీట్ చేశాడు.
అసాధారణమైన బౌలింగ్ యాక్షన్ కారణంగానే బుమ్రా వెన్ను ఒత్తిడికి గురవుతుందని నిపుణులు తేల్చారు. సుమారు 6 నెలల వరకు అతను ఆటకు దూరం కానున్నాడు. బుమ్రా స్థా స్టాండ్బైలో ఉన్న మహమ్మద్ షమీ, దీపక్ చాహర్తో పాటు హైదరాబాద్ స్టార్ మహమ్మద్ సిరాజ్ రేసులో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతన్ని సౌతాఫ్రికాతో సిరీస్కు తీసుకున్నారు. నేడు జరిగే మూడో టీ20లోనూ సిరాజ్ ఆడే అవకాశం ఉంది. అయితే షమీ అందుబాటులో లేకుంటేనే సిరాజ్ను జట్టులోకి తీసుకోనున్నారని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.