టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీమిండియా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్ నుంచి ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించిన బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్ల జట్టు జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది.
ఇప్పటికే రెండు మ్యాచ్లు జరగ్గా.. ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడేసి వన్డేలు, టీ20లు ఆడనుంది.

సన్నాహకాలు షురూ..
టీ20 సిరీస్కు కూడా ద్వితీయ శ్రేణితో కూడిన జట్టునే కొనసాగించనుండగా.. ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. టీమిండియా కోత్త హెడ్ కోచ్ కూడా ఈ పర్యటన నుంచే తమ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ క్రమంలోనే టీ20 జట్టులో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఓపెనర్లుగా యశస్వి, రుతురాజ్, అభిషేక్ శర్మ
శుభ్మన్ గిల్ను టీ20లకు దూరంగా ఉంచి వన్డేల్లో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. దాంతో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలు శ్రీలంక పర్యటనకు ఓపెనర్లుగా ఎంపికవ్వనున్నారు. ఈ ముగ్గురు ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నారు.
జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ సెంచరీ నమోదు చేయగా.. రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. యశస్వి జైస్వాల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
సూరీడు రీఎంట్రీ..
టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్తోనే ఈ ఎంట్రీ ఇవ్వనున్నాడు. హార్దిక్ పాండ్యా దూరమైతే అతనే భారత జట్టును నడిపించనున్నాడు. అతనితో పాటు శివమ్ దూబే, రింకూ సింగ్, రియాన్ పరాగ్లు మిడిలార్డర్ బ్యాటర్లుగా కొనసాగనున్నారు.
వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, సంజూ శాంసన్
ఈ సిరీస్కు వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, సంజూ శాంసన్లు ఎంపిక కానున్నారు. శ్రీలంకతో టీ20 సిరీస్కు రిషభ్ పంత్ను దూరంగా ఉంచితే ధ్రువ్ జురెల్ అవకాశం అందుకోనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఎంపికయ్యే అవకాశాలు ఉండటంతో వరుణ్ చక్రవర్తీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వవచ్చు. అక్షర్ పటేల్కు రెస్ట్ ఇస్తేనే వరుణ్ చక్రవర్తీకి అవకాశం దక్కుతుంది.
బుమ్రాకు రెస్ట్..
అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్లు పేసర్లుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. వర్క్లోడ్ నేపథ్యంలో బుమ్రాకు ఈ పర్యటన నుంచే విశ్రాంతినివ్వనున్నారు.
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్/శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శివమ్ దూబే, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్/ధ్రువ్ జురెల్, సంజూ శాంసన్, రవిబిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ/అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్