
న్యూఢిల్లీ: వెస్టీండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చేతన్ శర్మ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ గురువారం వెల్లడించింది. ఊహించినట్లుగానే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించింది. ఈ పర్యటనలోని వన్డే జట్టుకు కూడా ఈ ఇద్దరిని ఎంపిక చేయని విషయం తెలిసిందే.
గాయంతో జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకోగా.. వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం పిలుపును అందుకున్నాడు. అయితే ఈ ఇద్దరు ఆడటం వారి ఫిట్నెస్పై ఆధారపడి ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ సిరీస్ సమయానికి వీరు తమ గాయాల నుంచి కోలుకొని పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే జట్టులోకి వస్తారని తెలిపింది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన ఐపీఎల్ సంచలనం, కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్పై వేటు పడింది. ఐర్లాండ్తో పాటు ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో ఉమ్రాన్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో అతన్ని సెలెక్టర్లు పక్కనపెట్టారు.
అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్లను కొనసాగించిన బీసీసీఐ.. కొత్తగా రవిచంద్రన్ అశ్విన్ను జట్టులోకి తీసుకుంది. ఇక విరాట్ కోహ్లీ గైర్హాజరీలో దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్లు అవకాశం దక్కించుకున్నారు. ఈ నెల 22 నుంచి ఈ పర్యటన మొదలవ్వనుండగా.. ఆతిథ్య వెస్టిండీస్తో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. జూలై 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్