ఆసియా కప్ 2025 టోర్నీలో తొలి పోరుకు టీమిండియా సన్నదమైంది. మరికొద్ది క్షణాల్లో యూఏఈతో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. టైటిల్ ఫేవరేట్గా.. టీ20 ప్రపంచ ఛాంపియన్గా టీమిండియా బరిలోకి దిగుతుంది. యూఏఈపై గెలవడం టీమిండియాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ గెలుపుపై ఎవరికీ సందేహాలు కూడా లేవు. తర్వాతి పోరులో తలపడాల్సింది చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో కావడంతో ఈ మ్యాచ్ను భారత్ సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. అయితే ఈ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నా.. పరిస్థితులు కలిసి రావాలి. లేదంటే ఘోర పరాజయం తప్పదు. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. అంతేకాకుండా క్షణాల్లో మ్యాచ్ స్వరూపం మారిపోతుంది.
ముఖ్యంగా యూఏఈ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్లకే అడ్వాంటేజ్ లభిస్తోంది. బిగ్ మ్యాచ్ల్లో టీమిండియా టాస్ గెలవకపోతే.. వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా సాధారణ ఆటగాళ్లుగా మారిపోతారు. హాంగ్ కాంగ్, అఫ్గాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో డ్యూ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ కూడా డ్యూ కారణంగా తడబడ్డాడు. బంతిపై పట్టు చిక్కకపోవడంతో పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన జట్లు ముందుగా బౌలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డ్యూ కారణంగా భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది.

యూఏఈ వేదికగానే జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా ఓటమెరుగని జట్టుగా టైటిల్ అందుకుంది. కానీ అది వన్డే ఫార్మాట్. టీ20 ఫార్మాట్లో పరిస్థితులు చాలా వేగంగా మారుతుంటాయి. భారత్ ఉన్న గ్రూప్-ఏలో పాకిస్థాన్తో మినహా మరే జట్టుతో భారత్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం లేదు. కానీ సూపర్ 4లో శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో టాస్ గెలవడం టీమిండియాకు కీలకం. లేకుంటే ఇబ్బంది తప్పుదు. యూఏఈ వేదికగానే జరిగిన 2021 టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది.
లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆ టోర్నీలో టాస్.. టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపింది. యూఏఈ వేదికగా జరిగిన టోర్నీల్లో చాలా వరకు టాస్ గెలిచిన జట్లే విజయం సాధించాయి. ఈ క్రమంలోనే టీమిండియా టాస్ గెలవడం అత్యంత కీలకమని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత కెప్టెన్లకు మాత్రం టాస్ విషయంలో సరైన రికార్డ్ లేదు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ గత 15 మ్యాచ్ల్లో వరుసగా టాస్ ఓడిపోయింది. ఇదే ఇప్పుడు అభిమానులను కలవరపెడుతుంది.