హైదరాబాద్: పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్పై భారత సెలెక్టర్లు వేటు వేయనున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లోనూ వరుసగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఆడే భారత జట్టులో చోటు కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నాడు.
పేలవ బ్యాటింగ్తో తీవ్ర ఒత్తిడిలో కనిపించిన సూర్య.. ఢిల్లీతో మంగళవారం జరిగిన మ్యాచ్లో రెండు సునాయస క్యాచ్లను నేలపాలు చేశాడు. క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడ్డాడు. బ్యాటింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దాంతో సూర్యకుమార్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు దూరమైన నేపథ్యంలో అతనికి బ్యాకప్గా ఉన్న సూర్య తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. కానీ పేలవ ఫామ్తో అతన్ని సెలెక్టర్లు పక్కనపెట్టే అవకాశం ఉంది.
వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొడుతుండటంతో అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బ్యాకప్గా తెలుగు ప్లేయర్ హనుమ విహారీ పేరును పరిశీలిస్తున్నారు. ఇక చతేశ్వర్ పుజారా తన వైస్ కెప్టెన్సీని నిలబెట్టుకోనున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ జట్టుకు దూరమైన నేపథ్యంలో పుజారా వైస్ కెప్టెన్గా జట్టులో కొనసాగనున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే సూర్యను పక్కనపెడుతారని ఇప్పుడే చెప్పలేమని, సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారని సదరు అధికారి వెల్లడించాడు.
'సూర్యను పక్కనపెట్టాలా? లేదా? అనేది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. అయితే 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టుతో పాటు ఇద్దరు రిజర్వ్ ప్లేయర్లను మాత్రమే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేయాల్సి ఉంటుందని అందరు గుర్తించాలి. కాబట్టి జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. మయాంక్, సర్ఫరాజ్, అజింక్యా రహానే అద్భుతంగా రాణించినా.. ఎవరిని ఆడించాలనేది సెలెక్టర్ల నిర్ణయం.'అని సదరు అధికారి చెప్పుకొచ్చాడు.
ఈ నెల చివరి వారంలో టీమిండియాను ఎంపిక చేయనున్నారు. ఐసీసీ డెడ్లైన్ ప్రకారం మే 7లోపు జట్లను ప్రకటించాలి. మార్పులు చేర్పులకు మే 22 వరకు అవకాశం ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన జట్టునే బీసీసీఐ దాదాపు కొనసాగించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ బయల్దేరనుంది.
జూన్ 7 నుంచి లండన్లోని ఓవల్ వేదికగా జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాన్ కిషన్, జయదేవ్ ఉనాద్కత్, సూర్యకుమర్ యాదవ్/హనుమ విహారి