న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ బయల్దేరనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది.
ఇంగ్లండ్లోని ది ఓవల్ మైదానం వేదికగా జూన్ 7-11 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023 ఫైనల్ మే 28న నిర్వహించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత జట్టు జూన్ 1న లండన్ బయల్దేరే అవకాశం ఉంది.
అయితే ఇంగ్లండ్ పర్యటనకు ముందే ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరని ఆటగాళ్లు బీసీసీఐ ఏర్పాటు చేసే ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొననున్నారు. ఈ మెగా ఫైనల్ ఆడే జట్టును ప్రకటించడానికి ఐసీసీ మే 7న డెడ్లైన్గా విధించింది. దాంతో టీమ్ ఎంపికపై బీసీసీఐ సెలెక్టర్లు ఫోకస్ పెట్టారు. ఇక వెన్ను గాయంతో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2023 సీజన్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీపై కూడా ఎలాంటి స్పష్టత లేదు.

శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని పదిలం చేసుకోనుండగా.. తెలుగు తేజం హనుమ విహారి పేరును సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్వింగ్ కండిషన్స్ ఉండే లండన్లో బ్యాటింగ్ డెప్త్ ఉండటంతో పాటు క్రీజులో నిలబడే ఆటగాడు జట్టులో ఉండటం ముఖ్యమని టీమ్మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఓవైపు ధాటిగా ఆడినా మరోవైపు యాంకర్ రోల్ పోషించే ఆటగాళ్లు జట్టులో ఉంటే ఇన్నింగ్స్ నిలబడుతోందని, ఈ క్రమంలోనే టెస్ట్ స్పెషలిస్ట్ అయిన హనుమ విహారిని తీసుకోవాలని సెలెక్టర్లు చర్చించినట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు.
'శ్రేయస్ అయ్యర్ చాలా కీలకమైన ఆటగాడు. గాయంతో అతను దూరమవ్వడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని స్థానాన్ని హనుమ విహారితో భర్తీ చేస్తే ఎలా ఉంటుందనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. అతను చాలా అనుభవమైన ఆటగాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై గతంలో అతను అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్లో కూడా అతనికి మెరుగైన రికార్డు ఉంది. సెలెక్షన్ మీటింగ్లో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.'అని ఓ బీసీసీఐ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్ వెబ్సైట్కు తెలిపాడు.
ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్ట్ అనంతరం హనుమ విహారి మళ్లీ భారత తరఫున బరిలోకి దిగలేదు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ కీపర్గా కొనసాగించలేమని కూడా సదరు అధికారి పేర్కొన్నాడు. వన్డేల్లో రాహుల్ అద్భుతంగా కీపింగ్ చేసినా.. టెస్ట్ల్లో స్పెషలిస్ట్ కీపర్ ఉండాలని, 80-90 ఓవర్లు కీపింగ్ చేయడం ఆశామాషి వ్యవహరం కాదన్నాడు. స్పెషలిస్ట్ వికెట్ కీపర్గా కేఎస్ భరత్ను కొనసాగిస్తామని స్పష్టం చేశాడు.