హైదరాబాద్: 'పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రయత్నాన్ని ఆపవద్దు. మంచి విషయాలకు టైమ్ పడుతోంది. భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి'అనే పెద్దల మాట టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేకు సరిగ్గా సరిపోతుంది. అప్పుడెప్పుడో ధోనీ హయాంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరమైన రహానే.. కెవలం టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్గానే కొనసాగాడు. దాంతో గత మూడేళ్లుగా ఐపీఎల్లో కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేదు.
2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా విజేతగా నిలబెట్టిన రహానే.. అనంతరం పేలవ ప్రదర్శనతో వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు. గతేడాది సౌతాఫ్రికా పర్యటనలోనూ వైఫల్యాన్ని కొనసాగించి టెస్ట్ టీమ్లోనూ చోటు కోల్పోయాడు. కేవలం దేశవాళీ క్రికెట్కే పరిమితమైన రహానే కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ భూదేవికి ఉన్నంత సహనం ఉన్న రహానే.. ఏ మాత్రం దిగులు చెందకుండా తన ఆటను మెరుగుపరుచుకోవడంపై ఫోకస్ పెట్టాడు.

తన బలహీనతలపై బాగా వర్క్ చేసిన రహానే.. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయినా వయసు పైబడటంతో రహానే ప్రదర్శనను ఎవరూ పరిగణలోకి తీసుకోలేదు. ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా అతనిపై ఆసక్తి కనబర్చలేదు. దాంతో తొలి రౌండ్లో అమ్ముడుపోని జాబితాలో నిలిచాడు. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాకప్ ప్లేయర్గా పనికి వస్తాడని కనికరించి రూ.50 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.
ఆరంభ మ్యాచ్ల్లోనూ రహానేకు అవకాశం దక్కలేదు. బెన్ స్టోక్స్, దీపక్ చాహర్ గాయాలతో జట్టుకు దూరమవడంతో అనివార్య పరిస్థితుల్లో రహానేకు తుది జట్టులో అవకాశం కల్పించింది. ఈ చాన్స్ను రహానే రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ముంబై ఇండియన్స్తో ఆడిన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ బాదిన రహానే(27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 61), రాజస్థాన్ రాయల్స్పై 19 బంతుల్లో 31, ఆర్సీబీపై 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్పై 9 పరుగులే చేసి విఫలమైనా.. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 29 బంతుల్లోనే 71 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మళ్లీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడంతో పాటు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. జూన్ 7 నుంచి లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
ఈ జట్టులో రహానేకు అవకాశం దక్కడంతో ఫ్యాన్స్ సూక్తులతో నెట్టింట హల్చల్ చేస్తున్నారు. అజింక్యా రహానే రీఎంట్రీ అందరికి స్పూర్తిదాయకమని, జీవితంలో ఎవరైనా ఎప్పుడూ నిరాశకు గురికాకుడదని, మంచి రోజులున్నాయనే సానుకూల ధృక్పథంతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.