న్యూఢిల్లీ: పూర్తి స్థాయి సభ్యులు లేకుండానే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మరో ఐసీసీ టోర్నీకి భారత జట్టును ఎంపిక చేయనుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో తొందరపాటు అవసరం లేదని బీసీసీఐ భావిస్తోంది. న్యూస్ చానెళ్ల స్టింగ్ ఆపరేషన్స్లో బోర్డు అంతర్గత వ్యవహారాలు చెప్పిన చేతన్ శర్మ.. అవమానంతో చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అతని రాజీనామాతో సెలెక్షన్ కమిటీ చైర్మన్గా శివ్ సుందర్ దాస్ను నియమించగా.. చేతన్ శర్మ స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేదు. దాంతో ఐదుగురు సభ్యులు ఉండాల్సిన సెలెక్షన్ కమిటీ.. నలుగురు సభ్యులతోనే బాధ్యతలు నిర్వర్తిస్తోంది. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్తో పాటు ఆసియా కప్ టోర్నీలకు కూడా ఈ నలుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ కమిటీనే జట్లను ఎంపిక చేసింది.

జూన్లో ఇంగ్లండ్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత జట్టును కూడా ఈ నలుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ కమిటీనే ఎంపిక చేస్తోందని బోర్డుకు సంబంధించిన ఓ అధికారి స్పష్టం చేశారు. 'సెలెక్షన్ కమిటీలో చేతన్ శర్మ స్థానాన్ని భర్తీ చేసే విషయంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. కొత్త సెలెక్టర్ను తీసుకోవాల్సిన తొందరేం లేదు.
మాకు సెటిల్ అయిన టెస్ట్ టీమ్ ఉంది. ప్రస్తుతం ఉన్న సెలెక్టర్లకు టీమ్ ఎంపిక తెలుసు. ఆటగాళ్ల గాయాలు, రిప్లేస్మెంట్స్ గురించి పూర్తి అవగాహన ఉంది'అని ఓ అధికారి వెల్లడించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్లను ప్రకటించేందుకు ఐసీసీ మే 7న డెడ్లైన్ విధించింది. మే 22లోపు మార్పులు చేర్పులు చేసుకోవచ్చని చెప్పింది.
క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారమే తమ జట్టును ప్రకటించింది. భారత జట్టును కూడా ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరమైన ఆటగాళ్ల స్థానాల్లో పలువురి పేర్లను సెలెక్షన్ కమిటీ పరిశీలిస్తోంది. చేతన్ శర్మ స్థానాన్ని ఆసియాకప్ 2023 ముందు భర్తీ చేస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
'అప్కమింగ్ ఆసియాకప్ ముందు కొత్త సెలెక్టర్ను తీసుకుంటాం. ప్రస్తుతం మీడియా రైట్స్, స్పాన్సర్స్షిప్స్ రాబట్టడంపైనే బీసీసీఐ ఫోకస్ పెట్టింది. సమయం వచ్చినప్పుడు కొత్త సెలెక్టర్ నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. కొత్త అప్లికేషన్స్ తీసుకోవాలా? లేక షార్ట్ లిస్ట్ సభ్యుల నుంచి తీసుకోవాలా? అనేది డైసైడ్ చేయనుంది.'అని సదరు అధికారి వెల్లడించాడు.