
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై వేటు వేసే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయని విరాట్..పేలవ ఫామ్తోనే కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. ఇక కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం బ్యాట్ ఝులిపిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. సౌతాఫ్రికా పర్యటనతో పాటు ఐపీఎల్లోనూ విరాట్ తీవ్రంగా నిరాశపరిచాడు. తీరికలేని షెడ్యూల్ కారణంగానే విరాట్ విఫలమవుతున్నాడని, అతనికి రెస్ట్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు.
దాంతో సౌతాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్ల నుంచి విశ్రాంతి కల్పించగా.. విరాట్ ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్కు వెకేషన్కు వెళ్లాడు. మళ్లీ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన కోహ్లీ.. సత్తా చాటుతాడని అంతా భావించారు. కానీ రెండు ఇన్నింగ్స్ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్లో రెండు టీ20 సిరీస్లకు దూరంగా విరాట్.. మూడో టీ20తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాడు. ఈ సిరీస్లో రాణిస్తేనే అతనికి అగ్ని పరీక్ష. మరోవైపు చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విరాట్పై వేటు వేసే ప్రణాళికలను రచిస్తోంది.
ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం వెస్టిండీస్ టూర్ వెళ్లనుంది. జులై 22 నుంచి ఈ పర్యటన మొదలవ్వనుంది. అయితే ఈ పర్యటనకు విరాట్ కోహ్లీని దూరంగా ఉంచాలనే యోచనలో భారత సెలెక్షన్ కమిటీ ఉంది. ఈ పర్యటన నుంచి అతనికి విశ్రాంతి ఇవ్వాలని సమాలోచనలు చేస్తుంది. విరాట్ కోహ్లీతో పాటు రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలకు రెస్ట్ ఇవ్వాలనుకుంటుంది. ఈ విషయమై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఈ ముగ్గురి ఆటగాళ్లతో చర్చించనుంది. ఈ వారంలోనే ఈ పర్యటనకు జట్టు ఎంపిక చేయనున్నారు.
ఇక వెస్టిండీస్ పర్యటనలో భారత్ జులై 22 నుంచి 27వరకు మూడు వన్డేలు, 29 నుంచి ఆగస్టు 7 వరకు ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. టీ20 ప్రపంచకప్కు ఈ పర్యటనను సన్నాహకంగా వాడుకోవాలనుకుంటుంది. ఇంత కీలకమైన పర్యటన నుంచి విరాట్ను తప్పించాలని అనుకుంటున్నారంటే.. అతన్ని జట్టు నుంచి సాగనంపే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.