
న్యూఢిల్లీ: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడి జట్టు వివరాలను చేతన శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. ఫిట్నెస్ సాధించిన జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి పునరాగమనం చేయగా.. చాన్నాళ్లుగా టీ20లు ఆడని సీనియర్ పేసర్ మహ్మద్ షమిని ప్రపంచకప్కు స్టాండ్బైగా ఎంపిక చేయడం విశేషం. మూడు మార్పులు మినహా దాదాపు ఆసియాకప్ జట్టునే కొనసాగించారు. గాయంతో జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్కు అవకాశం ఇచ్చారు.
ఇక ఆసియాకప్ 2022 టోర్నీలో దారుణంగా విఫలమైన రిషభ్ పంత్పై వేటు వేసి సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ ఈ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. పంత్నే కొనసాగించింది. దాంతో టీమ్మేనేజ్మెంట్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించకున్నా పంత్కు ఎన్ని అవకాశాలు ఇస్తారని, సంజూ శాంసన్ చేసిన నేరం ఏంటని మండిపడ్డారు. డానిష్ కనేరియా వంటి మాజీ క్రికెటర్లు సైతం సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే సంజూ శాంసన్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు. అసలు టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేసే జట్టు కోసం సంజూ పేరునే పరిశీలించలేదన్నాడు. అతన్ని వన్డే ఫార్మాట్లో కొనసాగిస్తామని, సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు ఎంపిక చేస్తామని చెప్పాడు. ఆసియా కప్ 2022లో విఫలమైన రిషభ్ పంత్ను పక్కన పెట్టాలనే ఉద్దేశమే సెలెక్టర్లకు లేదని, భారత జట్టులో ఏకైక లెఫ్టాండ్ బ్యాటర్ అతనేనని చెప్పాడు. తనదైన రోజున పంత్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే పంత్ను సెలెక్ట్ చేసినట్లు స్పష్టం చేశాడు.
'ఎట్టి పరిస్థితుల్లోనైనా సంజూ శాంసన్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో బరిలోకి దిగుతాడు. సెలెక్టర్లు అతన్ని జింబాబ్వే పర్యటన నుంచి కొనసాగిస్తున్నారు. అలానే పంత్ను పక్కన పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. అసలు ఆ చర్చే లేదు. టీమిండియా టాపార్డర్లో ఉన్న ఏకైక లెఫ్ట్ హ్యాండర్ అతనే. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు.'అని సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు.