ఐదు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల వివరాలను సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ వెల్లడించింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఆడుతున్న ఆటగాళ్లందరినీ ఈ పర్యటనకు దూరంగా ఉంచింది. అందరూ ఊహించినట్లుగానే ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఐపీఎల్ 2024 సీజన్లో సత్తా చాటిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్పాండే తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నారు.

యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ.. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ వంటి అనుభవం కలిగిన ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఇక గతేడాది టీ20 ఫార్మాట్లో టీమిండియా రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగిన తెలుగు తేజం తిలక్ వర్మను బీసీసీఐ విస్మరించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
గతేడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీ20 సిరీస్లు ఆడిన టీమిండియాలో తిలక్ వర్మ కీలక వ్యవహరించాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్గా సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్లోనూ తిలక్ వర్మ సత్తా చాటాడు. ఐపీఎల్ 2024 సీజన్లోనూ తిలక్ వర్మ సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు తడబడిన వేళ తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.

13 మ్యాచ్ల్లో 41.60 సగటుతో 416 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. గత రెండేళ్లుగా తిలక్ వర్మ టీ20 ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నాడు. అయినా అతనికి సెలెక్టర్లు అవకాశం ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండానే భారత జట్టు నుంచి తిలక్ వర్మను తప్పించారని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో సత్తా చాటిన అభిషేక్ శర్మ కోసం తిలక్ వర్మకు మొండి చేయి చూపించినట్లు అర్థమవుతోంది.
జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే:
శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే.