తెలుగు తేజం, సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి జాక్పాట్ ఛాన్స్ దక్కింది. ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ విశాఖ కుర్రాడు అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు.
వచ్చే నెల 5 టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కనుంది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉండనున్న నేపథ్యంలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వనున్నారు. ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లతో కూడిన యువ జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డితో పాటు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, విజయ్కుమార్ వైశాఖ్, యశ్ దయాల్లకు టీమిండియా పిలుపు వచ్చినట్లు సమాచారం. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ కుర్రాళ్లతో పాటు కాస్త సీనియర్ ఆటగాళ్లు అయిన శుభ్మన్ గిల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకు కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. కొత్త కోచ్ పర్యవేక్షణలో టీమిండియా ఈ పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియన్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2024 సీజన్లో మొత్తం 13 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. 142.92 స్ట్రైక్రేట్తో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో కీలక బ్యాటర్లంతా విఫలమైన వేళ నితీష్ కుమార్ రెడ్డి(76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బౌలింగ్లోనూ 3 వికెట్లు తీసాడు. ఈ ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డ్తో రూ. 10 లక్షల నగదు పురస్కారం లభించింది. ఇప్పుడు ఏకంగా టీమిండియా పిలుపును అందుకున్నాడు. అతి త్వరలోనే టీమిండియాకు ఆడాలనే తన కలను నిజం చేసుకోబోతున్నాడు. జూలై 6 నుంచి 14 వరకు జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనుంది.