న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ తుది దశకు చేరడంతో అందరి కళ్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్పై పడ్డాయి. జూన్ 7-11 వరకు లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరిగే ఈ మెగా ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడుతున్న ఆటగాళ్లు మాత్రం టోర్నీ ముగిసిన వెంటనే లండన్ ఫ్లైట్ ఎక్కనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్పై ఇప్పటికే చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు తమ తుది జట్లను ప్రకటించారు. తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఐసీసీ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత తుది జట్టును అంచనా వేసాడు.

వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేను తుది జట్టులోకి తీసుకోవాలని చెప్పిన శాస్త్రి.. ముగ్గురు ప్లేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. 'పిచ్ కఠినంగా, పొడిగా ఉంటే కచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లతో ఆడాల్సిందే. అయితే ఇంగ్లండ్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ప్రస్తుతం అక్కడ ఎండలు కొడుతున్నా.. జూన్లో అక్కడి వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి.
కాబట్టి ఇద్దరి స్పిన్నర్లతో ఆడే అవకాశం టీమిండియాకు ఉంది. అలాగే ఇద్దరు పేసర్లు, ఓ పేస్ ఆల్రౌండర్తో బరిలోకి దిగాలి. 3+2 కాంబినేషన్ బాగుంటుంది. అలాగే ఐదుగురు బ్యాటర్లతో పాటు ఓ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉంటాడు. వర్ష ప్రభావం లేకుండా లండన్ కండిషన్స్ బాగుంటే నా తుది జట్టు కాంబినేషన్ ఇదే.
గత పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్ అదరగొట్టారు. నలుగురు పేసర్లలో ఒక ఆల్రౌండర్తో బరిలోకి దిగింది. ఇది మంచి కాంబినేషనే. కానీ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ముఖ్యం. ఎందుకంటే ఏ పేసర్ అయిన ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నా.. పేలవ ఫామ్తో తడబడినా సెకండ్ స్పిన్నర్ ఉపయోగపడుతాడు.
దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో అదరగొట్టిన అజింక్యా రహానే మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. అతన్ని తుది జట్టులో ఆడించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం అతను మంచి ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ పిచ్లపై అతనికి మంచి అనుభవం ఉంది. కేఎల్ రాహుల్ జట్టుకు దూరమైన నేపథ్యంలో రోహిత్ శర్మకు జతగా శుభ్మన్ గిల్ను ఆడించాలి.
ఫస్ట్ డౌన్లో పుజారా, నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో అజింక్యా రహానే ఆడాలి. ఆరో స్థానంలో రవీంద్ర జడేజాను బరిలోకి దించాలి. వికెట్ కీపర్ కేఎస్ భరత్కే నా ఓటు. ఇషాన్ కిషన్ కంటే అతనికే అనుభవం ఎక్కువ. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, రవీచంద్రన్ అశ్విన్, షమీ, సిరాజ్లను బ్యాటింగ్కు పంపాలి.'అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
రవిశాస్త్రి భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్(కీపర్), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.